మేకలకు కరోనా పరీక్షలు.. క్వారంటైన్‌కు తరలింపు

కరోనాకు మనుషుల్లో చిన్నా, పెద్దా.. రాజూ పేదా అనే తేడాి లేదని అనుకున్నాం. మనుషులు, జంతువులనే తేడా కూడా లేదని చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ. కర్ణాటకలో తాజాగా గొర్రెలు, మేకలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించడం విశేషం.

మనుషుల నుంచి పెంపుడు జంతువులకు కూడా కరోనా సో్కే అవకాశం ఉందని.. వాటి నుంచి కూడా మనుషులకు కరోనా సోకవచ్చని అధ్యయనాలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకలో 50కి పైగా గొర్రెలు, మేకలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. వాటి ఫలితాలు రావాల్సి ఉంది. ఈ ఉదంతం కర్నాటక రాష్ట్రంలోని తుమకూరు ప్రాంతంలో ఉన్న చిక్కనాయకహల్లిలో జరిగింది.

ఈ గ్రామంలోని అనేక గొర్రెలు, మేకలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాయి. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు అధికారులకు విషయం చేరవేశారు. దీంతో అక్కడికి చేరుకున్న వైద్యాధికారులు మేకలు, గొర్రెలతోపాటు వాటి యజమానికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. గొర్రెల యజమానికి కరోనా ఉన్నట్లు నిర్ధరించారు. గొర్రెలు, మేకల పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. ఈ లోపు ఆ యజమానికి చెందిన 50 మేకలు, గొర్రెలను ఐసోలేషన్‌లో ఉంచారు.

వైద్యాధికారులు వెళ్లినపుడు కూడా గొర్రెలు, మేకలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం గమనించారు. ఐతే కరోనా సోకడం వల్లే మేకలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాయని కచ్చితంగా చెప్పలేమని.. మైకోప్లాస్మా ఇన్‌ఫెక్షన్ చేరినా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయని పశు వైద్య నిపుణులు చెబుతున్నారు. జీవాల నుంచి సేకరించిన నమూనాలను భోపాల్‌లోని యానిమల్ హెల్త్ అండ్ వెటర్నరీ బయోలాజికల్స్ అండ్ వెటర్నరీ లాబొరేటరీకి పంపినట్టు అధికారులు తెలిపారు.