ధోనీ ఫ్యాన్స్‌.. టెన్ష‌న్ తీరిపోయింది

ఇండియ‌న్ క్రికెట్ ఆల్ టైం గ్రేట్స్‌లో ఒక‌డైన‌ మ‌హేంద్ర‌సింగ్ ధోని.. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసి రెండేళ్లు కావ‌స్తోంది. ఐపీఎల్‌లో కూడా అత‌ను ఒక‌ట్రెండేళ్ల‌కు మించి కొన‌సాగ‌క‌పోవ‌చ్చ‌ని అప్పుడే అనుకున్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌కు టాటా చెప్పాక ధోని రెండు ఐపీఎల్ సీజ‌న్ల‌లో ఆడాడు. 2020లో ఐపీఎల్ ఆల‌స్యంగా, యూఏఈలో జ‌ర‌గ‌గా.. గ‌త ఏడాది స‌గం సీజ‌న్ ఇక్క‌డ‌, స‌గం యూఏఈలో నిర్వ‌హించారు. మ‌ళ్లీ ఏ ఏడాది ఐపీఎల్ స్వ‌దేశానికి తిరిగొచ్చింది.

ధోనీకి ఇంకో రెండు నెల‌ల్లో 41 ఏళ్లు పూర్త‌వుతాయి. అత‌డి ఫిట్‌నెస్ త‌గ్గింది. బ్యాటింగ్‌లో మునుప‌టి వేగం లేదు. ఈ నేప‌థ్యంలో ఈ సీజ‌న్లోనే ఐపీఎల్‌కు కూడా టాటా చెప్పేస్తాడేమో అన్న సందేహాలు క‌లిగాయి. కానీ అభిమానుల్లో మాత్రం ఇంకో సీజ‌న్ ఆడితే బాగుండ‌నే ఆశ‌లున్నాయి. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం ఈ సీజ‌న్లో చివ‌రి లీగ్ మ్యాచ్‌కు కెప్టెన్‌గా టాస్‌కు వ‌చ్చాడు ధోని. దీంతో అంద‌రిలోనూ ఉత్కంఠ నెల‌కొంది.

ఐతే వ‌చ్చే సీజ‌న్లోనూ తాను కొన‌సాగ‌బోతున్న‌ట్లు క్లారిటీ ఇచ్చి అభిమానుల‌ను సంతోషంలో ముంచెత్తాడు మ‌హి. కొవిడ్ భ‌యాల‌తో ఈ ఐపీఎల్‌ను ముంబ‌యి, పుణె న‌గ‌రాల‌కు ప‌రిమితం చేసిన సంగ‌తి తెలిసిందే. ఐతే త‌న‌నెంత‌గానో అభిమానించే చెన్నై ఫ్యాన్స్ ముందు వీడ్కోలు మ్యాచ్ ఆడాల‌న్న‌ది ధోని కోరిక‌. ఈ విష‌య‌మై ఇంత‌కుముందే సంకేతాలు ఇచ్చాడు.

ఇప్పుడు ఆ మాట‌కు క‌ట్టుబ‌డి.. చెన్నైలో మ‌ళ్లీ ఐపీఎల్ ఆడ‌తాన‌ని స్ప‌ష్టం చేశాడు. చెన్నైలో తాను మ‌ళ్లీ ఐపీఎల్ మ్యాచ్ ఆడ‌క‌పోతే అక్క‌డి అభిమానుల‌కు అన్యాయం చేసిన‌ట్లే అవుతుంద‌ని అత‌న‌న్నాడు. అలాగే వ‌చ్చే ఏడాది దేశ‌వ్యాప్తంగా వివిధ న‌గ‌రాల‌కు తిరిగి అక్క‌డి అభిమానుల ప్రేమ‌నూ పొందాల‌నుకుంటున్న‌ట్లు కూడా ధోని చెప్పాడు. ఈ మాట‌ల్ని బ‌ట్టి చూస్తే ధోని వ‌చ్చే ఏడాది కూడా ఆడి రిటైర‌య్యే అవ‌కాశాలున్నాయ‌న్న‌ది స్ప‌ష్టం. రిటైర్మెంట్ సంగతి అడిగితే మాత్రం ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేన‌ని ధోని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.