హిందీ మాట్లాడేవాళ్లు పానీపూరి అమ్ముకుంటున్నారు: మంత్రి

హిందీ భాషపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ‍్యలపై ఇప్పటికీ కౌంటర్లు వస్తూనే ఉన్నాయి. ఆయన వ్యాఖ‍్యలను మొదటి నుంచి తమిళనాడు సర్కార్‌, సీఎం స్టాలిన్‌ ఖండించిన విషయం తెలిసిందే. హిందీ అస‌లు భాషే కాద‌ని..అది సంస్కృతం లోంచి వ‌చ్చిన ద‌త్త భాష అని దీనిని ప్ర‌త్యేకంగా చ‌ద‌వాల్సిన అస‌వ‌రం లేద‌ని.. ప్ర‌త్యేకంగా నేర్చుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఇక‌, ప్ర‌తిప‌క్ష అన్నాడీఎంకే స‌హా.. ఇత‌ర ప‌క్షాలు కూడా అమిత్ షాపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డిన సంద‌ర్భాలు ఉన్నాయి.

తాజాగా తమిళనాడు విద్యాశాఖ మంత్రి హిందీపై మ‌రింత సంచలన వ్యాఖ‍్యలు చేశారు. కోయంబ‌త్తూర్‌లోని భార‌తీయ‌ర్ యూనివ‌ర్సిటీలో జ‌రిగిన స్నాత‌కోత్స‌వ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి కే పొన్నుడి మాట్లాడుతూ.. హిందీ మాట్లాడేవారు కోయంబ‌త్తూర్‌లో పానీపూరీలు అమ్ముకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు. హిందీ భాష మరిన్ని ఎక్కువ ఉద్యోగాలు కల్పించేదే అయితే ఉత్తర భారతీయులు ఇక్కడ(తమిళనాడులో) పానీ పూరీ ఎందుకు అమ్ముకుంటున్నారని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు ఇంగ్లీష్‌, త‌మిళ్ మాట్లాడుతారని అన్నారు. అలాగే, తాము అంత‌ర్జాతీయ భాష‌గా ఇంగ్లీష్ నేర్చుకుంటుండ‌గా ఇత‌ర భాషల‌తో ప‌నేముందని మంత్రి ఆయ‌న ప్ర‌శ్నించారు. మరో అడుగుముందుకేసి.. హిందీ కేవ‌లం ఆప్ష‌న‌ల్ ల్యాంగ్వేజ్ మాత్ర‌మేన‌ని, దాన్ని నేర్చుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి కాద‌ని కుండబద్దలుకొట్టారు. త‌మిళ విద్యార్ధులు ఏ భాష నేర్చుకునేందుకైనా సిద్ధంగా ఉంటార‌ని చెప్పారు. అంతకు ముందు.. హిందీ జాతీయ భాష కాదంటూ కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే.