విద్యుత్ కొరత ఇంత భయంకరంగా ఉందా ?

దేశంలో బొగ్గు కొరత రోజురోజుకు పెరిగిపోతోంది. విద్యుత్ ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు తగ్గిపోతుండటంతో విద్యుత్ ఉత్పత్తి బాగా పడిపోతోంది. దీని కారణంగా విద్యుత్ కోతలు పెరిగిపోతున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సుమారు 16 రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. పరిస్థితి చేయి దాటి పోకముందే బొగ్గు సరఫరా చేయటానికి కేంద్రం ప్లాన్ చేసింది.

బొగ్గు రవాణా చేసే రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా కొన్ని రెగ్యులర్ రైళ్ళను కేంద్రం రద్దు చేసింది. బొగ్గు రవాణా కోసమని కేంద్ర రైల్వేశాఖ 42 ప్యాసెంజర్ రైళ్ళను రద్దు చేసింది. బొగ్గు సరఫరా కోసం ఆటంకాలు కలగకుండా ప్యాసింజర్ రైళ్ళను రద్దు చేయటం దేశంలో ఇదే మొదటిసారి. రాబోయే నెల రోజుల్లో మరిన్ని ప్యాసింజర్ రైళ్ళను రద్దు చేయటానికి కేంద్రం సిద్ధంగా ఉంది. పరిస్ధితిలో మార్పు రాకపోతే మే నెలాఖరుకు 650 రైళ్ళను రద్దు చేయటానికి రెడీ అవుతోంది.

రద్దు చేయబోయే రైళ్ళల్లో ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్, మెయిల్, కమ్యూటర్ రైళ్ళున్నట్లు సమాచారం. బొగ్గు కొరత కారణంగా ఒకవైపు విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతోంది. ఇదే సమయంలో మండుతున్న ఎండల కారణంగా విద్యుత్ వినియోగం పెరిగిపోతోంది. ఏసీలు, కూలర్లు, గీజర్లు వాడద్దంటు వివిధ ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తులు చేస్తున్నాయి. దీంతోనే దేశంలో విద్యుత్ సమస్య ఏ స్ధాయిలో ఉందో అర్ధమైపోతోంది.

దేశంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఏప్రిల్ మొదటి వారం నుంచి ఇప్పటివరకు 17 శాతం బొగ్గు నిల్వలు తగ్గిపోయాయి. మామూలుగా అయితే ప్రతి పవర్ ప్లాంట్ దగ్గర 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. అయితే ప్రస్తుతం చాలా పవర్ ప్లాంట్ దగ్గర ఒక్కరోజు విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గు మాత్రమే నిల్వ ఉంది. ఇదే పరిస్ధితి మరో రెండు రోజులు కంటిన్యూ అయితే ఢిల్లీలో ఆసుపత్రులు, మెట్రో సేవలు నిలిచిపోవటం ఖాయమని ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆందోళన వ్యక్తంచేశారు. బొగ్గు కొరతకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఒక కారణమైతే ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి బొగ్గు సరఫరా ఆగిపోవటం మరో కారణం. ఈ ఇబ్బందుల నుండి ఎప్పుడు గట్టెక్కుతామో ఏమో.