దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయా ?

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల క్రమంగా ఎక్కువైపోతోంది. దీంతో చనిపోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దేశం మొత్తం మీద ఈ రోజుకి కరోనా వైరస్ యాక్టివ్ కేసులు 15 వేలు దాటేశాయి. గడచిన 24 గంటల్లో కరోనా కేసులు కొత్తగా 2527 నమోదవ్వగా 33 మంది కోవిడ్ తో మరణించినట్లు నమోదైంది. అంటే ఒకవైపు కేసులు పెరుగుతుండటమే కాకుండా మరణాలు కూడా పెరుగుతున్నాయి.

దేశం మొత్తం మీద అత్యధికంగా ఢిల్లీలో ఆర్ వాల్యూ పెరుగుతోంది. ఆర్ వాల్యూ పెరగటమంటే కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత పెరుగుతున్నదనే అనుకోవాలి. ఆర్ వాల్యూ 1లోపుంటేనే తీవ్రత నియంత్రణలో ఉన్నట్లు లెక్క. అలా కాదని 1 దాటిందంటే తీవ్రత పెరిగిపోతున్నట్లే. అలాంటిది ఢిల్లీలో ఆర్ వాల్యూ తీవ్రత తాజాగా 2.1 నమోదైంది. అంటే కరోనా వైరస్ సోకిన ప్రతి రోగి నుండి దాని తీవ్రత మరో ఇద్దరికి సోకుతున్నట్లే అనుకోవాలి. ఈ విషయంలోనే శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

కేసుల తీవ్రత పెరుగుతున్నది కాబట్టి ఢిల్లీలో మళ్ళీ మాస్కులు ధరించటాన్ని ప్రభుత్వం కంపల్సరీ చేసింది. హైదరాబాద్ లో కూడా ప్రభుత్వం మాస్కులు ధరించాలని పదే పదే చెబుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ మహారాష్ట్ర, చెన్నై, కర్ణాటక, గుజరాత్, కేరళ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో నెమ్మదిగా పెరుగుతోంది. ఇప్పటికైతే మాస్కుల విషయంపైనే ప్రభుత్వాలు దృష్టి పెట్టినా ముందు ముందు మళ్ళీ ఆంక్షలను కఠినం చేసే విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నాయి.

కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో అవసరమైతే  ఆంక్షలను విధించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. లాక్ డౌన్ పద్దతిలో కాకపోయినా  ప్రజల సంచారం పై ఆంక్షలు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు నిబంధనలను అమలు  చేయటం లాంటివి ఆలోచిస్తోంది. చాలా రాష్ట్రాల్లో పరీక్షలు అయిపోయి పిల్లలకు సెలవులు ప్రకటిస్తున్నారు.

కాబట్టి విద్యార్ధుల విషయంలో  ప్రభుత్వాలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఎలాగైనా ఆర్ వాల్యూని  కంట్రోల్ చేయాలని ప్రభుత్వాలన్నీ  సీరియస్ గానే ఆలోచిస్తున్నాయి. అయితే దీనికి ప్రజల నుండే  సహకారం రావాలి. ప్రజా సహకారం లేనపుడు  ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలను విధించినా  ఉపయోగముండదు.