చైనా నుంచి ఏం కొంటున్నారు? – జాబితా అడిగిన కేంద్రం

India China

ఇండియాను గిల్లడానికి అదేపనిగా చైనా ప్రయత్నం చేస్తోంది. నేరుగా వీరుడిలా యుద్ధానికి రాకుండా సరిహద్దు దేశాలను రెచ్చగొడుతోంది. నేపాల్, బంగ్లాదేశ్ లను దువ్వుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ తో సుదీర్ఘకాలం నుంచి స్నేహం నడుపుతున్న చైనా శ్రీలంకను కూడా ఎప్పట్నుంచో దువ్వుతోంది. ఈ సమయంలో మనం ధైర్యం ప్రదర్శించకపోతే చైనా ఇక ఎప్పటికీ మన మాట వినదన్న కోణంలో భారత ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు పోవడానికే సిద్ధమవుతోంది.

తాజాగా 500 కోట్ల అత్యవసర నిధిని ఆయుధాల కొనుగోలు తదితరాలకు కేటాయిస్తూ సంచన నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వం చైనా ఉత్పత్తుల జాబితాను సమర్పించమంటూ ఇండియన్ కార్పొరేట్లకు ఆదేశాలను జారీ చేసింది.

సరిహద్దు ఉద్రిక్తత నేపథ్యంలో ఒక వైపు యుద్ధానికి సిద్ధమవుతూనే చైనాను ఆర్థికంగా కూడా దెబ్బకొట్టడానికి ఇండియా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే జాబితా అడిగింది. భారతదేశపు మొత్తం దిగుమతుల్లో చైనా వాటా 14 శాతంగా ఉంది. చైనా నుంచి ముఖ్యంగా మనకు మొబైల్స్, టెలికాం, పవర్, ప్లాస్టిక్ ఉత్పత్తులతో పాటు ఫార్మా కంపెనీలకు ముడిసరుకులు దిగుమతి అవుతున్నాయి.

భారత ప్రభుత్వపు ఆదేశాలతో ఇప్పటికే మొదటి జాబితా కేంద్రానికి అందింది. అంతేకాదు వాటికి సంబంధించిన సలహాలను, సూచలనలను కూడా కేంద్రం తీసుకుంది. చైనా నుండి దిగుమతి చేసుకుంటున్న వాటిలో ఇంకా చేతి గడియారాలు, గోడ గడియారాలు, ఆంపౌల్స్ (మందు నిల్వచేసే చిన్న గాజు సీసాలు, గ్లాస్ రాడ్లు, హెయిర్ క్రీమ్, హెయిర్ షాంపూలు, ఫేస్ పౌడర్ వంటి మేకప్ కిట్లు, ప్రింటింగ్ సిరా, పెయింట్స్ మరియు వార్నిష్‌లు, కొన్ని పొగాకు వస్తువులు ఉన్నాయి.

తక్కువ నాణ్యతతో మనదేశంలోకి వచ్చే సరుకులను ముఖ్యంగా చైనా నుంచి అరికట్టడానికి, దేశీయ తయారీని పెంచడానికి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఈ మధ్య ప్రధాని కార్యాలయం ఒక కీలక సమావేశం నిర్వహించింది. అది ఉత్పత్తి స్వావలంబన దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. దేశంలో చైనాకు వ్యతిరేకంగా భారతదేశం నినదిస్తున్న తీరు కూడా అందులో చర్చకు వచ్చింది.

ఇదిలా ఉండగా… ఇప్పటికే భారతప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలను తీసుకుంది. టైర్లపై దిగుమతి ఆంక్షలను విధించింది. అదే సమయంలో సరిహద్దు దేశాలు మన దేశంలో పెట్టుబడులు పెట్టకుండా నిషేధించింది.