కావాల‌నే నాపై వివాదం.. చిన‌జీయ‌ర్ స్వామి

తెలంగాణ కుంభ‌మేళాగా పిలుచుకునే స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ వ‌న దేవ‌త‌ల జాత‌ర‌పై చిన‌జీయ‌ర్ స్వామి విమ‌ర్శ‌లు గుప్పించార‌ని, ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని గ‌త రెండు మూడు రోజులుగా మీడియా వేదిక‌గా తీవ్ర‌స్తాయిలో డిమాండ్లు వినిపిస్తున్న విష యం తెలిసిందే. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క స‌హా.. ప‌లువురు కీల‌క నాయ‌కులు, మేధావులు కూడా చిన‌జీయ‌ర్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. ఇది తెలంగాణ‌ను అవ‌మానించ‌డ‌మే నంటూ.. దుయ్య‌బ‌ట్టారు. ఆర్థిక దైవ‌త్వం మీదేన‌ని.. విరుచుకుప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో చిన‌జీయ‌ర్ స్వామి మీడియా వేదిక‌గా ఆయా అంశాల‌పై వివ‌ర‌ణ ఇచ్చారు.

పనిగట్టుకుని వివాదం చేసి టీవీల్లో వాళ్ల వాళ్ల ముఖాలను ప్రదర్శిస్తున్నారని ఆయ‌న విమర్శించారు. రష్యా-ఉక్రెయిన్ హడావుడి తగ్గడంతో ఈ ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. 20 ఏళ్ల కింద అన్నమాట గురించి వివాదం జరిగినట్టు తన దృష్టికి వచ్చిందని, గ్రామదేవతల్ని కించపరిచినట్టుగా ఆరోపణలు వచ్చాయని తెలిపారు. తాము ఎప్పుడూ అలాంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. తాత్పర్యం తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే.. వారిపై జాలిపడాల్సి వస్తుందన్నారు. కొందరు సొంత లాభం కోసమే వివాదం చేస్తున్నారని తప్పుబట్టారు.

తాము చేప‌ట్టే అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ముస్లిం, క్రిస్టియన్స్‌ కూడా వస్తుంటారని తెలిపారు. తమకు కులం, మతం అనే తేడా లేదని చెప్పారు. అందరిని గౌరవించాలనేది తమ విధానమని ప్రకటించారు. మహిళలను చిన్నచూపు చూసేవారిని ప్రోత్సహించమని స్పష్టం చేశారు. కొందరు పనిగట్టుకుని సమస్యగా మారుస్తున్నారని, సమాజ హితం లేనివారే ఇలాంటి అల్పప్రచారం చేస్తున్నారని జీయర్‌స్వామి ఆక్షేపించారు. స‌మ‌తా మూర్తి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసిన తాము.. ఇలా వివ‌క్ష చూపిస్తామ‌ని ఎలా అంటార‌ని అన్నారు.

ఇక‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో త‌న‌కు ఉన్న వివాదాల‌పైనా స్వామి స్పందించారు. తమకు ఎవరితోనూ గ్యాప్ లేదని   స్వామి స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో గ్యాప్ వచ్చిందా అని విలేకరులు ప్రశ్నించగా ఆయన సమాధానమిచ్చారు. తమకు ఎవరితోనూ గ్యాప్ లేదని అయితే అవతలివాళ్లు గ్యాప్ పెంచుకుంటే తామేమీ చేయలేమన్నారు. మంచి లక్ష్యంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నామని అందుకే ధైర్యంగా మాట్లాడగలుగుతున్నామన్నారు. అదే సమయంలో రాజకీయాల్లోకి వస్తారా అని ఓ విలేకరి ప్రశ్నించడంతో దానికి కూడా జీయర్ జవాబిచ్చారు. తమకు అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.