ముంబయిలో ఇలాంటి దృశ్యం ఊహించగలమా?

ముంబయిలో జనజీవనం అత్యధికంగా ఆధారపడేది లోకల్ రైళ్ల మీదే. అక్కడ బస్సు సర్వీసులు పరిమితంగానే ఉంటాయి. జనాలు ఎక్కువగా రైళ్లనే ప్రిఫర్ చేస్తారు. నగరంలో ఏ మూల నుంచి ఇంకే మూలకైనా రైల్లోనే వెళ్లిపోవచ్చు. ఉదయం, సాయంత్రం అక్కడి రైళ్లలో జనాలు ప్రయాణించే తీరు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

మన దగ్గర ఓ మోస్తరు వేగంతో నడిచే సిటీ బస్సుల్లో వేలాడుతూ వెళ్లే కుర్రాళ్లను చూసి భయపడుతుంటాం. కానీ ముంబయిలో చిన్నా పెద్ద అని తేడా లేకుండా రైళ్లలో ఇలాగే వేలాడుతూ వెళ్తుంటారు. ఒక్కో రైలు పెట్టె వందల మందితో కిక్కిరిసి ఉంటుంది. పుట్ పాత్ మీది నుంచి వేలాడుతూ పదుల మంది అత్యంత ప్రమాదకర రీతిలో ప్రయాణం సాగిస్తుంటారు.

ఇక ఒక స్టేషన్లో రైలు వచ్చి ఆగినపుడు రెండు మూడు నిమిషాల వ్యవధిలో వందల మంది ఎక్కడం, దిగడం చూస్తే కళ్లు తిరుగుతాయి. ఐతే మనకు అవి చిత్రంగా అనిపించినా.. ముంబయి వాసులకు అది అలవాటైన వ్యవహారం.

ఐతే కరోనా పుణ్యమా అని చాలా మారినట్లే ముంబయి రైలు ప్రయాణాల తీరు కూడా మారిపోయింది. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా కరోనా ప్రభావం ఎదుర్కొంటున్న నగరం ముంబయే. అక్కడ రోజూ వేల కేసులు నమోదవుతున్నాయి. వందల మంది చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో భౌతిక దూరం, మాస్కులు, శానిటైజేషన్ సహా అన్ని షరతులనూ పకడ్బందీగా పాటించాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లో వందలు వేలమంది గుమికూడి ఒకరిపై ఒకరు పడి తోసుకుంటూ రైళ్లు ఎక్కే పరిస్థితి ఎంతమాత్రం లేదు. కనీసం ఆరడుగుల దూరం పాటిస్తూ గీసిన బాక్సుల్లోనే నిలబడాలి. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి. ఒకరినొకరు తాకడం కాదు కదా.. సమీపంలో వెళ్లడానికి కూడా వీల్లేదు. ఈ షరతులన్నీ పాటిస్తూ ప్రయాణికులు రైల్వే స్టేషన్లో ఎదురు చూడటం, రైళ్లు ఎక్కడం చాలా కొత్తగా కనిపిస్తోంది. ఒకప్పటి దృశ్యాలతో పోల్చుకుని ముంబయి ఎంత మారిపోయిందో అని అందరూ షాకవుతున్నారు. సంబంధిత వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.