బీసీసీఐ కోహ్లి అభిమానుల‌కు భ‌య‌ప‌డిందా?

కొన్ని నెల‌ల్లో భార‌త క్రికెట్లో ప‌రిణామాలు వేగంగా మారిపోయాయి. కొన్నేళ్లుగా కెప్టెన్‌గా మూడు ఫార్మాట్ల‌లో జ‌ట్టును న‌డిపిస్తున్న విరాట్ కోహ్లి.. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా ప‌గ్గాలు వ‌దిలేశాడు. ముందుగా త‌న‌కు తానుగా టీ20 సార‌థ్యాన్ని విడిచిపెట్ట‌గా.. బీసీసీఐ, సెల‌క్ట‌ర్లు అత‌డిని వ‌న్డే కెప్టెన్‌గా త‌ప్పించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీంతో హ‌ర్ట‌యిన కోహ్లి టెస్టు కెప్టెన్సీని కూడా వ‌దిలిపెట్టేశాడు. ఇది అత‌డి అభిమానుల‌కు ఏమాత్రం రుచించ‌లేదు.

కోహ్లి లాంటి దిగ్గ‌జ ఆట‌గాడికి స‌రైన స‌మాచారం ఇవ్వ‌కుండా వ‌న్డే కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. దీని వెనుక బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌భ్ గంగూలీ ఉన్నాడంటూ అత‌డిపై మండిప‌డ్డారు. కోహ్లి టెస్టు సార‌థ్యాన్ని విడిచిపెట్టిన‌పుడు బీసీసీఐ, గంగూలీపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జ‌రిగింది సోష‌ల్ మీడియాలో. క‌ట్ చేస్తే ఇప్పుడు విరాట్ కోహ్లి వందో టెస్టు మైలురాయి ముంగిట నిలిచాడు. శుక్ర‌వార‌మే ఈ ప్ర‌త్యేక మ్యాచ్ మొహాలిలో ఆరంభం కాబోతోంది. శ్రీలంక‌తో జ‌ర‌గ‌బోయే ఈ మ్యాచ్‌కు అభిమానులను అనుమ‌తించ‌కూడ‌ద‌ని బీసీసీఐ నిర్ణ‌యించ‌డం దుమారం రేపింది.

బెంగ‌ళూరులో జ‌రిగే రెండో టెస్టుకు మాత్రం అభిమానుల‌ను అనుమ‌తించి, దీనికి ముందు కోల్‌క‌తాలో జ‌రిగిన టీ20 సిరీస్‌కు కూడా ప్రేక్ష‌కుల‌కు ప‌చ్చ జెండా ఊపి కేవ‌లం కోహ్లి వందో టెస్టుకు మాత్రం అభిమానుల‌ను దూరం పెట్ట‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి సోష‌ల్ మీడియాలో. ఒక రోజంతా దీనిపై ట్విట్ట‌ర్లో చ‌ర్చ జ‌రిగింది. బీసీసీఐని, గంగూలీని తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారు కోహ్లి అభిమానులు.

ఈ ట్రోలింగ్ అంతా చూశాక బీసీసీఐ జ‌డుసుకున్న‌ట్లే ఉంది. కోహ్లి వందో టెస్టుకు అభిమానుల‌ను అనుమ‌తిస్తామ‌ని ప్ర‌క‌టించారు. 50 శాతం ఆక్యుపెన్సీ మ‌ధ్య ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ప్రేక్ష‌కులుంటే మ‌రింత ఉత్సాహంగా ఆడే కోహ్లికి ఇది సానుకూల విష‌య‌మే. మ‌రి అభిమానుల మ‌ధ్య వందో టెస్టులో వంద కొట్టి రెండేళ్ల‌కు పైగా సాగుతున్న నిరీక్ష‌ణ‌కు కోహ్లి తెర‌దించుతాడేమో చూడాలి.