సివిల్ టాపర్లు.. ఏపీ వైపు చూసే ఛాన్స్ లేదా?

పాలకుడు ఎవరైనా.. వారిని నడిపించేది మాత్రం అధికారులే. ప్రభుత్వానికి కళ్లు.. చెవులుగా వ్యవహరించే ఐఏఎస్ అధికారులు సమర్థతే పాలకులకు మంచి పేరు తెచ్చేలా చేస్తుంది. పాలకుడు ఎంతటి సమర్థుడైనా.. అధికారుల చేత పని చేయించటంలో విఫలమైతే.. ప్రభుత్వ బండి సక్సెస్ ఫుల్ గా నడిచే అవకాశం ఉండదన్నది నిజం. దేశంలో అత్యున్నత అధికారులుగా సివిల్స్ కు ఎంపికైన వారిని పరిగణిస్తారు. వీరిలో టాప్ ర్యాంకర్ల వైపు రాష్ట్రాలు ఆశగా చూస్తాయి.

అయితే.. చాలామంది టాపర్లు.. తమ అభిరుచికి తగ్గట్లు రాష్ట్రాల్ని ఎంపిక చేసుకుంటారు. వీలైనంతవరకు పెద్ద రాష్ట్రాల్లో పని చేసేందుకు మొగ్గు చూపుతారు.
ఉమ్మడి రాష్ట్రంలో అత్యున్నత సివిల్స్ అధికారులు ఏపీని ఎంపిక చేసుకునేవారు. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో.. అప్పటి నుంచే ఏపీ వైపు చూసే అధికారుల సంఖ్య కాస్త తగ్గిందనే చెప్పాలి. దీనికి కారణం.. రాష్ట్ర రాజధాని నగరం లేకపోవటం.. చాలా రాష్ట్రాల రాజధాని నగరాల్లో ఉన్న మౌలిక వసతులు ఏపీలో లేకపోవడం కూడా ఒక కారణం.

అయినప్పటికీ.. రాష్ట్రం ఒక మోస్తరు స్థాయిలో ఉండటంతో కొంత ఆసక్తి ఉండేది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మొగ్గు చూపే సంఖ్యతో పోలిస్తే.. విభజన తర్వాత ఎక్కువమంది టాపర్లు తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాలనే ఎంపిక చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ సర్కారు కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయటం.. ఇప్పటికే ఉన్న జిల్లాల పరిధిని మరింత కుదించివేస్తున్న వైనం కొత్త సమస్యకు తెర తీస్తుందని చెబుతున్నారు.

ప్రస్తుతం ఛత్తీస్ గఢ్.. ఈశాన్య రాష్ట్రాలకు సివిల్స్ లో తక్కువ ర్యాంకు వచ్చిన వారు తమ ఆప్షన్లుగా తీసుకొని వెళుతున్నారో.. అదే పరిస్థితి ఏపీకి ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. విభజన తర్వాత ఏపీకి ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నప్పటికీ.. ఐఏఎస్ అధికారులు రాష్ట్రం వైపు మొగ్గు చూపేవారు. ఏపీలో పని చేసేందుకు ఉన్న అవకాశాల నేపథ్యంలో.. తమ హయాంలో ఏమైనా చేశామన్న  వృత్తి పరమైన తృప్తి ఉంటుంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో కలెక్టర్.. జేసీల కింద నాలుగు రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. కొత్త జిల్లాలతో అలాంటి పరిస్థితి ఉండదు.

జిల్లా విస్తీర్ణం బాగా తగ్గిపోతుంది. కేవలం రెండు సబ్ డివిజన్లకే ఒక జిల్లా ఉండే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కలెక్టర్.. జేసీల పరిధి ఒక సబ్ కలెక్టర్.. ఆర్డీవో స్థాయికి పడిపోతుంది. కొన్ని జిల్లాల్లో అయితే ప్రస్తుత ఆర్డీవో స్థాయి కంటే తక్కువ మండలాలు ఉండే పరిస్థితి. ఇలాంటి వేళలో టాపర్లు ఏపీకి టాటా చెప్పేసే అవకాశం ఉందంటున్నారు. చిన్న జిల్లాలకు సివిల్స్ టాపర్స్ వచ్చే అవకాశమే కాదు.. రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ లు సైతం జిల్లాలకు వెళ్లే అవకాశం లేదనే మాట  బలంగా వినిపిస్తోంది. కొత్త జిల్లాలతో పాలనాపరంగా సమర్థులైన అధికారుల లేమి.. రాష్ట్రాన్ని డెవలప్మెంట్ పరంగా దెబ్బ తీసే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.