‘బుల్లీ బాయ్’ సృష్టికర్త అరెస్ట్

ముస్లిం మహిళలను టార్గెట్ చేస్తూ రూపొందించిన బుల్లి బాయ్ యాప్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ముస్లిం మహిళల ఫొటోలను మార్ఫ్ చేసి వారిని వేలంపాట వేస్తున్నామంటూ యాప్ లో ఫొటోలు అప్ లోడ్ చేయడం సంచలనం రేపింది. ఈ వ్యవహారం వెనుక ఉన్న ఓ యువతితో పాటు ముగ్గురిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇక, తాజాగా బుల్లి బాయ్ యాప్ సృష్టికర్తను ఢిల్లీ పోలీసులు అస్సాంలో అరెస్టు చేశారు. బుల్లి బాయ్ యాప్ ను రూపొందించిన 21 ఏళ్ల నీరజ్ బిష్ణోయ్‌ ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అస్పాంలోని దిగంబర్ జొర్హట్‌కు చెందిన నీరజ్ భోపాల్‌లోని వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన ఢిల్లీ పోలీసులు అస్సాంలో నీరజ్ ను అరెస్టు చేశారు. నీరజ్ తో పాటు ఓ డివైజ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డివైజ్ సాయంతోనే బుల్లి బాయ్ యాప్ ను నీరజ్ డెవలప్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

అరెస్టు తర్వాత నీరజ్ ను ఢిల్లీకి తీసుకువచ్చి విచారణ చేయబోతున్నట్లు తెలుస్తోంది. గిట్ హబ్‌లో బుల్లి యాప్ తయారీదాచేయడంతో ప్రధాన నిందితుడు నీరజ్ అని పోలీసులు తెలిపారు. అంతకుముందు, ఈ కేసులో ఉత్తరాఖండ్‌కు చెందిన 19 ఏళ్ల యువతి శ్వేతా సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతోపాటు బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల ఇంజనీరింగ్‌ విద్యార్థి విశాల్‌ కుమార్‌ ఝాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.