కోహ్లీ అది కూడా వదులుకోక తప్పదా?

టీ20 ప్రపంచకప్ మీద పూర్తిగా ఆసక్తి కోల్పోయారు భారత అభిమానులు. సోమవారం ఇండియా మ్యాజ్ జరుగుతుంటే ఎవరికీ దానిపై ఫోకస్ లేదు. కారణం.. ఈ టోర్నీలో ఇప్పటికే భారత్ సెమీస్ రేసు నుంచి తప్పుకోవడమే. నమీబియాతో నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో భారత్ సునాయాసంగా గెలిచేసింది. నెట్ రన్ రేట్ విషయంలో గ్రూప్‌లో అగ్రస్థానం సాధించినా.. పాయింట్లలో మూడో స్థానానికి పరిమితం కావడంతో భారత్ సెమీస్‌కు దూరం అయింది. ఆదివారం ఆఫ్ఘనిస్థాన్.. న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంతోనే భారత్ అవకాశాలకు తెరపడ్డ సంగతి తెలిసిందే.

సోమవారం నాటి మ్యాచ్‌కు సంబంధించినంత వరకు భారత అభిమానులను ఎమోషనల్‌గా కనెక్ట్ చేసింది ఒకటే విషయం. అదే.. టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లికి ఇదే చివరి మ్యాచ్. ఇప్పటికే ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా దిగిపోయిన కోహ్లి.. టీ20 ప్రపంచకప్‌ అవ్వగానే భారత టీ20 జట్టు కెప్టెన్సీకి కూడా టాటా చెప్పేయనున్నట్లు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. చివరి మ్యాచ్‌లో గెలవనైతే గెలిచాడు కానీ.. టోర్నీలో మరీ ఘోరంగా సూపర్-12 దశ నుంచే నిష్క్రమించాల్సి రావడం కోహ్లి సహా అందరికీ నిరాశ కలిగించేదే.

ఇప్పుడిక కోహ్లి స్థానంలోకి ఎవరొస్తారనే చర్చ మొదలైంది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరు కెప్టెన్ అయి సక్సెస్ అయినా.. కోహ్లికి మరిన్ని ఇబ్బందులు తప్పవు. టీ20 కెప్టెన్‌గా ఏమీ సాధించని కోహ్లి.. వన్డేల్లోనూ ఇప్పటిదాకా మేజర్ టైటిల్ ఏదీ గెలవలేదు. టెస్టుల్లో మాత్రమే కెప్టెన్‌గా అతడి రికార్డు బాగుంది. భవిష్యత్ దిశగా యువ ఆటగాళ్లెవరికైనా టీ20 పగ్గాలప్పగిస్తే.. ఆటోమేటిగ్గా వన్డే పగ్గాలు కూడా అతడికే ఇవ్వాలన్న డిమాండ్ మొదలవుతుంది.

కోహ్లి ఆటగాడిగా ఒకప్పట్లా గొప్ప ఫాంలో ఉంటే అయినా వన్డే పగ్గాలు నిలిచేవేమో కానీ.. ఆటగాడిగా కూడా తడబడుతుండటం.. రెండేళ్లుగా ఏ ఫార్మాట్లోనూ సెంచరీనే చేయకపోవడం కోహ్లికి ప్రతికూలమైన విషయమే. అందులోనూ కోహ్లికి ఎంతో ఇష్టుడు, అనుకూలుడైన రవిశాస్త్రి కోచ్‌గా దిగిపోతున్నాడు. ద్రవిడ్ ఆ స్థానంలోకి రాబోతున్నాడు. అతను కుర్రాళ్లకు పెద్ద పీట వేస్తాడన్న సంగతి తెలిసిందే. కాబట్టి 2023 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని కోహ్లిని ఆ ఫార్మాట్లో నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించడమో.. లేక తనే తప్పుకోవడమో జరగొచ్చన్నది విశ్లేషకుల మాట.