పతకాన్ని మించిన విజయమిది


ప్రపంచానికి హాకీ నేర్పించిన ఘనత ఇండియాది. కానీ మన దగ్గర హాకీ నేర్చుకున్న వాళ్లు ఆ ఆటలో మరింత నైపుణ్యం సంపాదించి ప్రపంచ స్థాయికి ఎదిగితే భారత్ మాత్రం ఘన చరిత్ర ఉన్న ఆటలో పాతాళానికి పడిపోయి గత రెండు మూడు దశాబ్దాల్లో ఎన్నో పరాభవాలు ఎదుర్కొంది. ప్రపంచ స్థాయి టోర్నీలకు వెళ్తే పతకం గెలవడం సంగతలా ఉంచితే.. కనీసం పోటీలో కూడా ఉండని పరిస్థితి. అడపా దడపా కొన్ని విజయాలు సాధించిన.. కీలక సందర్భాల్లో తడబడి పరాజయాలు ఎదుర్కోవడం పురుషులు, మహిళల జట్లకు అలవాటే.

ముఖ్యంగా ఒలింపిక్స్ వస్తున్నాయంటే భారత హాకీ జట్ల మీద అసలు అంచనాలే ఉండవు. పురుషుల జట్టు ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌కు వరుసగా అర్హత సాధిస్తున్నప్పటికీ పతకానికి రేసులోనే ఉండట్లేదు. మహిళల జట్టయితే ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే కష్టం. మూడు దశాబ్దాలకు పైగా విరామం తర్వాత రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినా.. అసలు ఈవెంట్లో పేలవ ప్రదర్శన చేసింది.

టోక్యో ఒలింపిక్స్‌కు కూడా భారత మహిళల హాకీ జట్టు అర్హత సాధించినప్పటికీ.. ఆ జట్టుపై ఎవరికీ అంచనాలు లేవు. గ్రూప్ స్టేజ్ దాటుతుందన్న ఆశే లేదు. పైగా టోర్నీలో వరుసగా మూడు మ్యాచుల్లో ఓడి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది మహిళల జట్టు. మరోసారి గ్రూప్ దశలోనే నిష్క్రమించడం లాంఛనమే అనుకుంటే.. అనూహ్యంగా చివరి రెండు మ్యాచుల్లో నెగ్గి క్వార్టర్స్‌ చేరుకుంది. అదే గొప్ప అనుకుంటుంటే.. క్వార్టర్స్‌లో సాధించిన విజయం ఒక మహాద్భుతమే. ఎందుకంటే క్వార్టర్స్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా కావడంతో భారత్ గెలుపు గురించి ఎవ్వరూ ఆలోచించలేదు. భారత్ ఎంత తేడాతో ఓడుతుందా అనే చూశారు. ఆ జట్టుపై భారత్‌కు పేలవ రికార్డుంది.

ఒలింపిక్స్‌లో మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచి సూపర్ ఫాంలో ఉన్న జట్టుపై భారత్ గెలుస్తుందని ఎవరైనా ఊహిస్తారా? కానీ సోమవారం ఆ అద్భుతమే జరిగింది. ఆస్ట్రేలియాను 1–0తో ఓడించి హాకీ ప్రపంచానికి దిమ్మదిరిగే షాకే ఇచ్చింది భారత మహిళల జట్టు. ఇది భారత మహిళల హాకీ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే విజయం అనడంలో సందేహం లేదు. మహిళల జట్టు ఇంకో విజయం సాధిస్తే భారత్‌కు పతకం కూడా ఖరారవుతుంది. ఐతే పతకం గెలుస్తారో లేదో కానీ.. ఇప్పటికే పతకాన్ని మించిన అద్భుత విజయం సాధించారని చెప్పొచ్చు.