యాక్సిడెంట్ కేసుకి కరోనా… 40 మంది డాక్టర్లకు షాక్

ఓ కరోనా రోగికి అత్యవసర చికిత్స చేసినందుకు 40 మంది డాక్టర్లు క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. పూణెలోని కడ్నీ ఏరియాకు చెందిన ఓ ఆటో డ్రైవర్ యాక్సిడెంట్‌కు గురై ఆసుపత్రిలో చేరాడు. మార్చి 31న తీవ్ర గాయాలతో ఉన్న ఆ ఆటోడ్రైవర్‌ను ఆసుపత్రిలో తీసుకొచ్చిన అతని కుటుంబ సభ్యులు… ‘అతను ఎక్కడికి వెళ్లి రాలేదని, నగరంలోనే ఉంటున్నాడని’ డాక్టర్లకు అబద్ధం చెప్పారు.

దాంతో ఎమర్జెన్సీ కేసు కింద అతన్ని ఆసుపత్రిలో చేర్చుకున్న వైద్యులు, చికిత్స అందించి ప్రాణాలను కాపాడారు. అయితే తాజాగా ఐసీయూలో ఉన్న అతనికి జ్వరం రావడంతో డాక్టర్లకు అనుమానం వచ్చి, కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్‌గా వచ్చింది. కుటుంబసభ్యులను ఈ విషయమై నిలదీయగా… అతను నిజాముద్దీన్ మర్కజ్‌‌లో జరిగిన తబ్లిగీ జమాజ్‌కు వెళ్లివచ్చినట్టు తెలిపారు.

ఆ సమాధానంతో షాక్ తిన్న వైద్యులు… అతనికి చికిత్స చేసిన 40 మంది వైద్యులు, నర్సులు, మరో 30 మంది సహాయక సిబ్బంది, పేషెంట్లను క్వారంటైన్‌కు తరలించారు. వేర్వేరు గదులల్లో ఉంచి,  వీరి సాంపిల్స్‌ను కూడా కరోనా పరీక్షల కోసం పంపించారు. ఆటోడ్రైవర్ మర్కజ్‌కు వెళ్లివచ్చిన విషయాన్ని దాచిపెట్టిన కుటుంబసభ్యులు, అతని ప్రాణాలను కాపాడిన వైద్యుల లైఫ్‌ను ప్రమాదంలో పడేసినట్లైంది.