వన్డే క్రికెట్లో నాలుగున్నర దశాబ్దాల కిందట్నుంచి ప్రపంచకప్ ఉంది. టీ20ల్లో కూడా 2007 నుంచి ప్రపంచకప్ జరిపిస్తున్నారు. కానీ టెస్టు క్రికెట్లో మాత్రం ప్రపంచకప్ లేకపోయింది. ఇందులోనూ ప్రపంచ విజేతను తేల్చే టోర్నీ ఉండాలన్న ప్రతిపాదన దశాబ్దాల కిందటే మొదలైంది. కానీ అది కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పట్టేసింది. 2013లోనే టెస్టు క్రికెట్లో ప్రపంచ ఛాంపియన్షిప్కు సన్నాహాలు జరిగాయి. కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు సుదీర్ఘ కసరత్తు తర్వాత రెండేళ్ల కిందట ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ను మొదలుపెట్టారు.
రెండేళ్ల పాటు సుదీర్ఘంగా సాగే ప్రక్రియలో అనేక పరీక్షలను దాటి భారత్, న్యూజిలాండ్ ఫైనల్కు అర్హత సాధించాయి. ఇంగ్లాండ్లోని సౌథాంప్టన్లో ఈ నెల 18-22 తేదీల మధ్య ఫైనల్ షెడ్యూల్ చేశారు. కచ్చితంగా ఈ మ్యాచ్లో ఫలితం రావాలన్న ఉద్దేశంతో రిజర్వ్ డే కూడా పెట్టారు. కానీ ఏం ప్రయోజనం? ఇంత చేసినా మ్యాచ్లో ఫలితం వచ్చేలా కనిపించడం లేదు.
ఈ సమయంలో బాగా వర్షాలు పడే సౌథాంప్టన్లో మ్యాచ్ పెట్టడం ఐసీసీ చేసిన పెద్ద తప్పని అర్థమైంది. నాలుగు రోజుల ఆటలో కేవలం ఒకటిన్నర రోజు మాత్రమే ఆట సాగింది. మొదటి రోజు, అలాగే నాలుగో రోజు వర్షం వల్ల పూర్తిగా ఆట రద్దయింది. మిగతా రెండు రోజుల్లో కూడా ఆట సరిగా సాగలేదు. భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో ఇప్పటిదాకా రెండు వికెట్లే పడ్డాయి. రిజర్వ్ డేను కూడా కలుపుకున్నప్పటికీ ఇక మిగిలింది రెండు రోజులే. ఈ రెండు రోజుల్లో మ్యాచ్ ఎంతమాత్రం సజావుగా సాగుతుందో తెలియదు. చూస్తుంటే మ్యాచ్లో ఫలితం రావడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. మ్యాచ్ డ్రా అయ్యేలా ఉంది. సంయుక్త విజేతలను ప్రకటించక తప్పేలా లేదు. ఇదే జరిగితే ఈ ఛాంపియన్షిప్ నిర్వహించడంలో అర్థం ఉండదు. రెండు జట్లూ ప్రపంచ ఛాంపియన్లమని సగర్వంగా చెప్పుకోలేవు.
మ్యాచ్ను ఈ సమయంలో దుబాయ్లో కాకుండా ఇంగ్లాండ్లో నిర్వహించడం ఓ తప్పయితే.. తుది విజేతను ఒక్క మ్యాచ్తో తేల్చాలనుకోవడం మరో తప్పు. బెస్ట్ ఆఫ్ త్రీ పెడితే ఈ సమస్య ఉండేది కాదని మాజీలు అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఫైనల్ ఇలా పూర్తి స్థాయిలో జరక్కపోవడం భారత్కు మేలు చేసేదే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మ్యాచ్లో ప్రస్తుతానికి కివీస్దే పైచేయి. ఆ జట్టు బౌలింగ్ భీకరంగా కనిపిస్తోంది. మ్యాచ్ పూర్తిగా జరిగితే భారత్కు ఓటమి తప్పదని.. కాబట్టి వర్షం పడటం టీమ్ ఇండియాకు మంచిదనే అంటున్నారు. కానీ వరుణుడి వల్ల ఓటమి తప్పించుకుంటే అది భారత్కు ఏమేర సంతృప్తినిస్తుందన్నది ప్రశ్న.
This post was last modified on June 22, 2021 9:31 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…