కోహ్లి ఇప్పుడైనా కొడతాడా?

విరాట్ కోహ్లి మేటి బ్యాట్స్‌మనే. కానీ అతను మేటి కెప్టెనా అంటే మాత్రం భిన్నాభిప్రాయాలు వినిపిస్తాయి. అతడి కెప్టెన్సీ రికార్డు గొప్పగానే కనిపిస్తుంది. అతను అన్ని ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా జట్టుకు ఎన్నో విజయాలు సాధించిపెట్టాడు. కానీ ఇప్పటిదాకా ఐసీసీ టోర్నీల్లో మాత్రం జట్టును గెలిపించలేకపోయాడు. అతడి నాయకత్వంలోనే 2019 వన్డే ప్రపంచకప్ ఆడింది భారత్. అందులో సెమీస్ వరకు వచ్చింది కానీ.. ముందుకు వెళ్లలేకపోయింది. దాని కంటే ముందు కోహ్లి నాయకత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఫైనల్‌కు వరకు వచ్చి ఆగిపోయింది.

ఇక ఐపీఎల్‌లో కెప్టెన్‌గా కోహ్లి వైఫల్యం గురించి అందరికీ తెలిసిందే. ఒక్కసారి కూడా కప్పు కొట్టలేకపోయాడు. ఇప్పటిదాకా నాయకుడిగా పెద్ద ట్రోఫీ ఏదీ అతను సాధించలేకపోయాడు. ఐతే ఇప్పుడు ఓ అత్యున్నత ట్రోఫీని అందుకునే అవకాశం అతడి ముందు నిలిచింది.

ప్రతిష్ఠాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ శుక్రవారమే ఆరంభం కాబోతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి మేటి జట్లను వెనక్కి నెట్టి భారత్, న్యూజిలాండ్ నిలకడైన ప్రదర్శనతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఏడాదిన్నర పాటు సాగిన డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఈ రెండు జట్లూ అద్భుత ప్రదర్శన చేశాయి. ఇప్పుడు టైటిల్ కోసం ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్2లో ఐదు రోజల పాటు తలపడబోతున్నాయి. వన్డే, టీ20 ఫార్మాట్లలో ప్రపంచకప్‌లు ఎన్నో చూశాం కానీ.. టెస్టుల్లో ప్రపంచ కప్ తరహాలో ఇలా ప్రపంచ ఛాంపియన్‌షిప్ జరగడం ఇదే తొలిసారి.

దశాబ్దాల ఆలోచన ఎట్టకేలకు రెండేళ్ల కిందట అమల్లోకి వచ్చింది. బలాబలాల్లో భారత్.. కివీస్‌కు ఏమాత్రం తక్కువగా లేదు. ఫామ్ ప్రకారం చూస్తే కోహ్లీసేనే ఈ మ్యాచ్‌లో ఫేవరెట్. కానీ ఇంగ్లాండ్‌లో పరిస్థితులు న్యూజిలాండ్‌కే బాగా అనుకూలం. పెద్దగా హడావుడి చేయకుండా సింపుల్‌గా మైదానంలోకి అడుగు పెట్టి చక్కటి ప్రదర్శన చేయడం కివీస్‌ ప్రత్యేకత. కేన్ విలియమ్సన్ నాయకత్వంలోని ఆ జట్టును ఓడించి ప్రపంచ టైటిల్ అందుకోవడం అంత తేలికైతే కాదు. అలాగని భారత్ అవకాశాల్ని కొట్టిపారేయలేం. ప్రధాన ఆటగాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేసి, జట్టు సమష్టితత్వాన్ని ప్రదర్శిస్తే కోహ్లీ చేతిలోకి తొలి మేజర్ ట్రోఫీ రావడం సాధ్యమే.