ప్రపంచ క్రికెట్ నివ్వెర పోయే ఘటన..

క్రికెట్ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎప్పుడూ చోటు చేసుకోని ఉన్మాద చర్య ఒకటి చోటు చేసుకుంది. తాను అడిగినంతనే ఔట్ ఇవ్వలేదన్న కోపంతో స్టార్ ఆటగాడు చేసిన చేష్టతో అవాక్కు అవుతున్నారు. బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు మరే క్రికెటర్ వ్యవహరించని తీరును గ్రౌండ్ లో ప్రదర్శించిన తీరును తిట్టిపోస్తున్నారు. ఎంత ఔట్ ఇవ్వకపోతే మాత్రం ఇలా చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఎవరా ఆటగాడంటే.. బంగ్లాదేశ్ స్టార్ అలౌండర్ షకీబ్ అల్ హసన్. ప్రస్తుతం ఆ దేశంలో జరుగుతున్న ఢాకా ప్రీమియర్ డివిజన్ టీ20 క్రికెట్ లీగ్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది.

మహమ్మదెన్ స్పోర్టింగ్ క్లబ్ కు అబహాని లిమిటెడ్ జట్టు మధ్య మ్యాచ్ జరుగుతోంది. షకిబ్ అల్ హసన్ మహ్మదెన్ స్పోర్టింగ్ క్లబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బౌల్ వేసినంతనే.. అవుట్ అని అప్పీల్ చేయటం.. అందుకు అంపైర్ నో చెప్పటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతగాడు.. కాలితో ఎగిరి వికెట్లను బలంగా తన్నటంతో మిడిల్ వికెట్ పక్కకు పడిపోయింది. అంతేకాదు.. అంపైర్ పై దూసుకెళ్లాడు. ఇదే టోర్నీలో ఫీల్డ్ చేస్తున్న సమయంలోనూ అంపైర్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతూ.. అతనిపైకి వెళ్లాడు.

ఇతగాడి తీరుపై క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతడి వ్యవహారశైలి కచ్ఛితంగా ఐసీసీ ఉల్లంఘన కిందకే వస్తుందని చెబుతున్నారు. బంగ్లాదేశ్ క్రికెట్ క్లబ్ సైతం ఇతడిపై ఎలాంటి చర్య తీసుకుంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా జంటిల్ మ్యాన్ గేమ్ గా అభివర్ణించే క్రికెట్ ఇప్పటికే గౌరవ మర్యాదలు తగ్గాయన్న విమర్శలు వినిపిస్తున్న వేళ.. షకిబ్ తీరు మాత్రం సిగ్గుతో తలదించుకునేలా ఉందని చెప్పక తప్పదు.