వార్నర్ పట్ల మరీ ఇంత దారుణమా?


ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పేరెత్తగానే గుర్తుకొచ్చేది డేవిడ్ వార్నర్. చెన్నైకి ధోని, బెంగళూరుకు కోహ్లి, ముంబయికి రోహిత్ ఎలాగో.. హైదరాబాద్ జట్టుకు వార్నర్ అలా. చాలా ఏళ్ల నుంచి సన్‌రైజర్స్‌కు ఆడుతూ.. సారథిగా ఆ జట్టును గొప్పగా నడిపిస్తున్నాడతను. 2016లో సన్‌రైజర్స్ టైటిల్ గెలిచిందంటే అందుకు ప్రధాన కారణం వార్నరే. మొదట్లో స్థానికంగా పెద్దగా ఆదరణ లేని సన్‌రైజర్స్‌కు ఫాలోయింగ్ పెంచి.. ఆ జట్టుకు ఒక ఐడెంటిటీ తేవడంలో వార్నర్ కీలక పాత్ర పోషించాడు. ప్రతి సీజన్లోనూ జట్టును ముందుండి నడిపిస్తూ సన్‌రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంటాడు వార్నర్.

ఐతే ఈ సీజన్లో అతను తనదైన శైలిలో చెలరేగిపోయాడు. జట్టు ప్రదర్శన కూడా బాగా లేదు. ఐతే ఇందుకు వార్నర్‌ ఒక్కడిని నిందించలేం. ఆ జట్టు సెలక్షనే ధారుణంగా ఉంటోంది. కాస్తో కూస్తో ఆడే మనీష్ పాండేను తప్పించడం, పేలవ ప్రదర్శన చేస్తున్న విజయ్ శంకర్‌ను జట్టులో కొనసాగించడం లాంటి నిర్ణయాలతో జట్టు ప్రదర్శనను దెబ్బ తీశారు.

ఐతే మొన్న ఓ మ్యాచ్‌కు పాండేను తప్పించడం పట్ల వార్నర్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సందర్భంగా వార్నర్ అసంతృప్తిని వ్యక్తం చేయడం టీమ్ మేనేజ్మెంట్‌కు నచ్చలేదు. ఇన్నేళ్లు జట్టుకు వార్నర్ చేసిన సేవనంతా మరిచిపోయారు. రెండు రోజులకే అతణ్ని కెప్టెన్సీ నుంచి తప్పించేసి విలియమ్సన్‌కు పగ్గాలప్పగించారు. కెప్టెన్సీ మాత్రమే తప్పిస్తే అది అతడికి భారం కాకూడదన్న ఉద్దేశంతో అలా చేశారనుకోవచ్చు. కానీ ఆదివారం రాజస్థాన్‌తో మ్యాచ్‌కు వార్నర్‌ను తుది జట్టు నుంచే తీసేశారు. అతడి స్థానంలోకి మహ్మద్ నబిని తీసుకున్నారు.

అంతటితో ఆగకుండా మ్యాచ్ ఆరంభమైన కాసేపటికి వార్నర్‌తో హెల్మెట్ తెప్పించారు. ఇలాంటి పనులు బెంచ్ మీద ఉన్న ఎవ్వరైనా చేయాల్సిందే. కానీ ఇప్పుడు వార్నర్ లాంటి ఆటగాడిని తుది జట్టు నుంచి తీసేయడమే అవమానంగా అభిమానులు భావిస్తుంటే.. తనతో ఈ పని చేయించడం చూస్తే అతణ్ని టీమ్ మేనేజ్మెంట్ టార్గెట్ చేసిందనే భావనే కలుగుతోంది. ఇది ఐపీఎల్ అభిమానులు ఎవరికీ రుచించడం లేదు. అందుకే సోషల్ మీడియాలో సన్‌రైజర్స్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు.