15 గంటల వ్యవధిలో గాంధీలో కరోనా మరణాలు 35!

హైదరాబాద్ లో.. ఆ మాటకు వస్తే తెలంగాణలో కరోనా చికిత్సకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతి పెద్ద ఆసుపత్రి గాంధీ. దాదాపు పదిహేను వందల బెడ్లతో భారీగా ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం 305 మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే.. కేవలం 15 గంటల వ్యవధిలో ఏకంగా 35 మంది మరణించిన దుస్థితి చోటు చేసుకుంది. సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటల మధ్యలో ఏకంగా ఇంత ఎక్కువగా మరణాలు చోటు చేసుకోవటం షాకింగ్ గా మారింది. ఈ విషయాన్ని ఒక ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది.

అయితే.. ఈ మరణాలకు గాంధీని.. అందులో పని చేసే వైద్యుల్ని బాధ్యుల్ని చేయటం తప్పే అవుతుంది. ఎందుకంటే.. హైదరాబాద్ మహానగరంలోని కార్పొరేటు ఆసుపత్రులు.. ఇతర ఆసుపత్రులతో పాటు.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న ఆసుపత్రుల్లో సీరియస్ గా ఉన్న కరోనా పేషెంట్లను ఆఖరి నిమిషాల్లో గాంధీకి తీసుకురావటంతో మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇందులో.. గాంధీ వైఫల్యం అని చెప్పటం మా ఉద్దేశం కాదు. కరోనా మరణాలు ఎంత ఎక్కువగా ఉన్నాయన్నది చెప్పాలన్నదే లక్ష్యం.

కరోనా తీవ్రత పెద్దగా లేదని.. ఒకవేళ పాజిటివ్ వచ్చినా.. పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదన్న వాదనల్ని నమ్మి.. పెద్దగా పట్టనట్లు తిరగటం.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుందన్నది మర్చిపోకూడదు. కరోనా కారణంగా ఇన్ని మరణాలు చోటు చేసుకుంటున్నా.. ప్రభుత్వం మాత్రం రోజుకు నాలుగైదు మరణాల్ని మాత్రమే చూపిస్తోంది. పదిహేను గంటల వ్యవధిలో మరణించిన 35 మందిలో 45 ఏళ్లు.. అంతకంటే తక్కువ వయస్కులు ఏకంగా తొమ్మిది మంది ఉండటం గమనార్హం. మిగిలిన వారంతా 46 ఏళ్ల నుంచి 83 ఏళ్ల మధ్యలోని వారు కావటం గమనార్హం.

మరణించిన 35 మందిలో 16 మంది మహిళలు కాగా.. 19 మంది పురుషులు. సాధారణంగా పాజిటివ్ లోనూ.. మరణాల్లోనూ పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకు భిన్నంగా.. తాజాగా మాత్రం పురుషులకు దగ్గరగా.. మహిళల మృతుల సంఖ్య రావటం ఆందోళన కలిగించేదే. సో.. కరోనా తీవ్రత ఎంత ఉందన్న విషయాన్ని అర్థం చేసుకొని అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.