హైదరాబాద్‌లో నో ఐపీఎల్.. బేఫికర్

ఈసారి ఐపీఎల్ ఇండియాలోనే నిర్వహిస్తున్నప్పటికీ.. హైదరాబాద్‌కు మ్యాచ్‌లు కేటాయించకపోవడం ఇక్కడి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. టోర్నీ వేదికల్ని ఎనిమిది నుంచి ఆరుకు కుదించడానికి కరోనానే కారణం. ఐతే కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ముంబయిని ఐపీఎల్ కోసం ఎంపిక చేసి.. వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న హైదరాబాద్‌కు మొండి చేయి చూపించడం విడ్డూరంగా తోచింది అందరికీ.

అలాగే అసలు ఐపీఎల్ ఫ్రాంఛైజీనే లేని అహ్మదాబాద్‌ను ఒక వేదికగా ఎంపిక చేసి అధిక ప్రాధాన్యం ఇవ్వడమూ ఆశ్చర్యం కలిగించింది. కానీ నిరాశ వ్యక్తం చేయడం మినహా హైదరాబాద్ అభిమానులు చేయడానికి ఏమీ లేకపోయింది. ఐతే హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ జరగట్లేదని అభిమానులు మరీ ఫీలవ్వాల్సిన అవసరమైతే లేదు. ఇక్కడ మ్యాచ్‌లున్నా పెద్దగా ఒరిగేదేమీ లేదనడానికి రెండు కారణాలున్నాయి.

ఈసారి ఐపీఎల్‌కు అభిమానులను స్టేడియాల్లోకి అనుమతించడం లేదు. ముందు తొలి దశ మ్యాచ్‌లకు మాత్రమే అభిమానులకు నో ఎంట్రీ అన్నాయి బీసీఐ వర్గాలు. కానీ తాజాగా బీసీసీఐ కార్యదర్శి బ్రిజేష్ పటేల్ మాట్లాడుతూ.. సీజన్ మొత్తం స్టేడియాల్లోకి అభిమానులను అనుమతించేది లేదని, త్వరలోనే బీసీసీఐ కార్యవర్గం ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేయనుందని స్పష్టం చేశాడు.

స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూసే అవకాశం లేనపుడు హైదరాబాద్‌లో మ్యాచ్‌లు జరిగితే ఏంటి.. జరక్కపోతే ఏంటి? ఇంకోవైపు చూస్తే.. టోర్నీలో ఏ జట్టుకూ సొంత గడ్డ అంటూ ఏదీ లేదు. సొంత మైదానంలో ఏ జట్టూ మ్యాచ్‌లు ఆడదు. తటస్థ వేదికల్లోనే ప్రతి జట్టుకూ మ్యాచ్‌లున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక అనుకూలత అంటూ ఏ జట్టుకూ ఉండదు. కాబట్టి సన్‌రైజర్స్ సొతగడ్డపై ఆడట్లేదని ఫీలవ్వాల్సిన పని కూడా లేదు. కాబట్టి హైదరాబాద్‌కు మ్యాచ్‌లు కేటాయించట్లేదని అభిమానులు ఎంతమాత్రం ఫీలవ్వాల్సిన పని లేదు.

ఐతే ప్రస్తుతం భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌ ప్రేక్షకులను అనుమతిస్తూ.. ఐపీఎల్‌కు నో ఎంట్రీ అనడం ఆశ్చర్యం కలిగించొచ్చు. కానీ ఆ సిరీస్ రెండు జట్ల మధ్య జరిగేది. ఆటగాళ్లకు బయో బబుల్ ఏర్పాటు చేసి సిరీస్ నిర్వహించడం కష్టం కాదు. కానీ ఐపీఎల్ అంటే ఎనిమిది జట్లతో ముడిపడ్డ వ్యవహారం. అభిమానుల మధ్య మ్యాచ్‌లు నిర్వహిస్తే కరోనా రిస్క్ ఎక్కువ. ఇటీవల పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో నిర్లక్ష్యం వహిస్తే ఆటగాళ్లు కరోనా బారిన పడి టోర్నీని అర్ధంతరంగా ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ ఏడాది చివర్లో భారత్.. టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో ఐపీఎల్‌ మీద కరోనా ఎఫెక్ట్ పడి ఏదైనా తేడా కొడితే.. ఐసీసీ టోర్నీ వేదికను మార్చాలని చూడొచ్చు. ఐపీఎల్ మధ్యలో ఆగినా బీసీసీఐకి ఎంత నష్టమో చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలోనే రిస్క్ ఎందుకని టోర్నీకి అభిమానులను దూరంగా పెట్టినట్లు తెలుస్తోంది.