పెళ్లి ఆగింది.. చిత్తూరు అమ్మాయి అమెరికాలో సూసైడ్

అయ్యో అన్న వేదనకు కలిగించే ఉదంతం అమెరికాలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఒక అమ్మాయి అమెరికాలో ఐటీ ఎంప్లాయ్ గా పని చేస్తోంది. ఆమె సోదరుడు కూడా అమెరికాలోనే ఉంటున్నారు. త్వరలో పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి.. అనుకోని రీతిలో ఆత్మహత్య చేసుకోవటం విషాదాన్ని నింపింది. ఇంతకూ ఆమె సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే..


చిత్తూరు పట్టణంలోని పోలీసుల కాలనీకి చెందిన సుష్మా అమెరికాలోని డల్లాస్ లో ఉంటున్నారు. ఐటీ ఉద్యోగినిగా ఉన్న ఆమెకు.. తమ జిల్లాలోని పూతలపట్టు ప్రాంతానికి చెందిన భరత్ తో పెళ్లి ఫిక్స్ అయ్యింది. త్వరలో పెళ్లి జరగాల్సిన వేళలో.. అబ్బాయి తరఫు వారు పెళ్లిని కాన్సిల్ చేసుకున్నారు. దీంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన సుష్మా సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

అమెరికాలోనే ఉంటున్న సుష్మ సోదరుడు.. తన చెల్లి ఆత్మహత్య చేసుకున్న వైనాన్ని చిత్తూరులోని తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో.. వారి కుటుంబం శోక సందంలో మునిగింది. త్వరలో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో.. తీరని శోకం చోటు చేసుకోవటం పలువురిని కలిచివేసింది. తమ కుమార్తెకు ఆత్మహత్యకు కారణంగా.. వరుడి కుటుంబమే అంటూ సుష్మ తల్లిదండ్రులు వారిపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో రెండు రోజుల్లో సుష్మ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.