ఆర్‌సీబీ బాగుపడదా.. ఫెయిల్యూర్ ప్లేయర్‌కి 14.25 కోట్లు

పేరు గొప్ప ఊరు దిబ్బ.. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రస్థానానికి ఈ సామెత చక్కగా సరిపోతుంది. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ సహా స్టార్ ఆటగాళ్లతో ఎప్పుడూ కళకళలాడిపోతూ కనిపిస్తుందీ జట్టు. కానీ ఈ ఇద్దరు మినహాయిస్తే ఈ జట్టుకు ఆడే స్టార్ల ఆట అంతంతమాత్రంగా ఉంటుంది. కొన్నేళ్లుగా వీళ్లిద్దరూ కూడా అంత నిలకడగా ఏమీ ఆడట్లేదు.

ఐపీఎల్ వేలం వచ్చిన ప్రతిసారీ కొందరు స్టార్ల కోసం పట్టుబట్టి వారి స్థాయికి మించిన రేటు పెట్టి కొనుక్కుంటుంది ఆర్సీబీ. కానీ ఆ ఆటగాళ్లు అంచనాల్ని అందుకోరు. యువరాజ్ సింగ్ సహా ఈ జట్టుకు ఆడిన చాలామంది స్టార్ల పరిస్థితి ఇదే. వేరే జట్ల తరఫున సత్తా చాటే ఆటగాళ్లు ఆర్సీబీ తరఫున ఫెయిలవుతుంటారు. ఈ జట్టులో విఫలమై వేరే జట్టుకు వెళ్లిన వాళ్లు అక్కడ అక్కడ అదరగొట్టేస్తుంటారు. వేలంలో సరైన ఆటగాళ్లను ఎంచుకోకపోవడమే ఆర్సీబీకి అతి పెద్ద సమస్యగా పరిణమిస్తుంటుంది. అలాగే ఆటగాళ్ల స్థాయికి మించి రేటు పెట్టడం కూడా ప్రతికూలతే.

గత ఏడాది ఆర్సీబీకి ఆడిన ఆరోన్ ఫించ్, క్రిస్ మోరిస్, శివమ్ దూబె సహా చాలామంది ఆటగాళ్లను మధ్యలో ఆ జట్టు విడిచిపెట్టింది. వేలంలో కొత్త ఆటగాళ్లను కొనుక్కుందామని బరిలోకి దిగింది. ఐతే ఆ జట్టు పంజాబ్ జట్టు విడిచిపెట్టిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ కోసం అవసరానికి మించి పోటీ పడింది. చెన్నైతో సై అంటే సై అని అతడి కోసం ఏకంగా రూ.14.25 కోట్లు (2 మిలియన్ డాలర్లు) పెట్టేసింది. మ్యాక్స్‌వెల్ గత కొన్నేళ్ల ఐపీఎల్ ప్రదర్శన చూసిన వాళ్లకు ఈ రేటు షాకివ్వక మానదు. అప్పుడెప్పుడో 2014 సీజన్లో ఒకసారి మాత్రమే మ్యాక్స్‌వెల్ బాగా ఆడాడు. ఆ తర్వాత వరుసగా విఫలమయ్యాడు.

పంజాబ్ అతడి మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఇబ్బంది పడింది. గత సీజన్లో కూడా బ్యాటింగ్‌లో అతను ఘోరంగా విఫలమయ్యాడు. ఇక అతడితో చాలని వదిలిపెట్టేసింది. అలాంటి ఆటగాడికి ఆర్సీబీ రూ.14.25 కోట్లు పెట్టేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఉన్న డబ్బుల్లో మెజారిటీ అతడికే వెళ్లిపోవడంతో మిగతా వారిలో సరైన ఆటగాళ్ల ఎంచుకునే అవకాశం లేకపోయింది. ఇలా భారీ రేటు పలికిన ఏ ఆటగాడూ ఐపీఎల్‌లో బాగా ఆడిన చరిత్ర లేని నేపథ్యంలో ఆర్సీబీకి ఇంకోసారి బ్యాడ్ సీజన్ తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే.. ద‌క్షిణాఫ్రికా ఆల్‌రౌండ‌ర్ క్రిస్ మోరిస్ కోసం ఏకంగా రూ.16.25 కోట్లు పెట్టేసింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే ఓ ఆట‌గాడికి ప‌లికిన అత్య‌ధిక రేటు ఇది. మ‌రోవైపు న్యూజిలాండ్ ఫాస్ట్ బౌల‌ర్ కైల్ జేమీస‌న్ కోసం బెంగ‌ళూరు ఏకంగా రూ.15 కోట్లు వెచ్చించింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌల‌ర్ జే రిచ‌ర్డ్‌స‌న్‌ను పంజాబ్ రూ.14 కోట్ల‌కు కొనుగోలు చేసింది. భారత ఆట‌గాళ్ల‌లో అత్య‌ధికంగా క‌ర్ణాట‌క ఆల్‌రౌండ‌ర్ కె.గౌత‌మ్ రూ.9.25 కోట్లు ప‌లికాడు. ఆస్ట్రేలియా పేస‌ర్ మెరిడిత్‌ను పంజాబ్ రూ.8 కోట్ల‌కు కొనుగోలు చేసింది. మ్యాక్స్‌వెల్‌తో క‌లిపితే ఈసారి వేలంలో టాప్-5 ధ‌ర‌లు ప‌లికిన ఆట‌గాళ్ల జాబితా ఇది.