ఫార్మసీ విద్యార్థిని గ్యాంగ్ రేప్ పై షాకింగ్ నిజాలు వెలుగులోకి

హైదరాబాద్ మహానగర శివారులో ఫార్మసీ విద్యార్థిని ఒకరు గ్యాంగ్ రేప్ కు గురి కావటం.. దానికి నలుగురు ఆటో డ్రైవర్లు కారణం కావటం తెలిసిందే. తొలుత అత్యాచార యత్నంగా భావించినప్పటికీ.. అదేమీ కాదని.. ఆమె గ్యాంగ్ రేప్ కు గురైనట్లుగా తెలుస్తోంది. అత్యాచారం చేసిన తర్వాత.. గుట్టుచప్పుడు కాకుండా హత్య చేయాలని భావించినప్పటికి.. సకాలంలో పోలీసులు స్పందించటంతో దారుణం మధ్యలోనే ఆగింది. గ్యాంగ్ రేప్ కు కారణమైన నలుగురు ఆటో డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించిన సందర్భంగా షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఈ రోజు (శుక్రవారం) వారు చేసిన దుర్మార్గాన్ని అధికారికంగా వెల్లడించే వీలుందని చెబుతున్నారు.

పోలీసుల విచారణలో నిందితులు ఏం చెప్పారంటే..
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఫార్మసీ విద్యార్థిని గ్యాంగ్ రేప్ కు సంబంధించిన నలుగురు ఆటో డ్రైవర్లు పక్కా ప్లాన్ తోనే వ్యవహరించారు. మేడ్చల్ కు సమీపంలోని ఒక కాలేజీలో సెకండ్ ఇయర్ ఫార్మసీ చదువుతున్న ఆమె.. రోజూ కీసర మండలం రాంపల్లి చౌరస్తా వద్ద కాలేజీ బస్సు దిగుతుంది. అక్కడి నుంచి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలోని ఇంటికి ఆటోలో వెళ్లేది.

కొన్నిసార్లు సెవన్ సీటర్ ఆటోలో వెళ్లేది. ఇలాంటి సమయంలోనే ఆమెను చూసిన నిందితుడైన ఆటో డ్రైవర్ కన్ను పడింది. బుధవారం సాయంత్రం ఎప్పటిలానే సాయంత్రం ఐదున్నర.. 5.45 గంటల సమయంలో రాంపల్లి చౌరస్తా వద్ద కాలేజీ బస్సు దిగింది. అప్పటికే ప్రధాన నిందితుడు ఆటోతో సిద్ధంగా ఉన్నాడు. తాను కన్నేసిన అమ్మాయి బస్సు దిగిందంటూ మిగిలిన ముగ్గురు ఆటో డ్రైవర్లకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. అప్పటికే ఆటోలో ఇద్దరు మహిళలు.. యువకుడు ఉండటంతో బాధితురాలు అందులో ఎక్కింది.

కొంతదూరం ప్రయాణం తర్వాత ఆటోలోని వారు దిగిపోవటం.. బాధితురాలు దిగాల్సిన చోట ఆటో ఆపకుండా.. వేగంగా ముందుకు పోనివ్వటంతో.. ప్రమాదాన్ని శంకించిన ఆమె వెంటనే తమ వారికి ఫోన్లో సమాచారం ఇచ్చింది. వెంటనే అలెర్టు అయిన వారు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు.. నిందితుడు ఆటోను ముందుకు పోనిచ్చి.. యానంపేట వద్ద సిద్ధంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు బాధితురాలికి చెరోవైపున కూర్చున్నారు. ఆమెకు మత్తు మందు ఇచ్చి.. సిద్దంగా ఉంచిన వ్యానులో ఎక్కించి.. అత్యాచారం చేశారు.

అనంతరం ఆమెను గుట్టుచప్పుడు కాకుండా చంపేయాలని ప్లాన్ చేశారు. అయితే.. అప్పటికే పోలీసుల సైరన్ మోగటం.. ఆటోలో అమ్మాయిని కిడ్నాప్ చేశారు.. ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు మైకుల్లో ప్రకటించటంతో.. దొరికితే తమను ఎన్ కౌంటర్ చేస్తారన్న భయంతో బాధితురాల్ని పొదల్లో పడే పరారయ్యారు. సెల్ ఫోన్ లొకేషన్ ద్వారా బాధితురాలిని పోలీసులు తొలుత గుర్తించారు. అనంతరం.. నిందితుల్ని ఫోన్ సిగ్నల్ ద్వారా గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారించగా.. షాకింగ్ నిజాలుబయటకు వచ్చాయి. గతంలోనూ వీరు ఒంటరిగా వెళ్లే విద్యార్థినులు.. ఉద్యోగుల్ని లక్ష్యంగా చేసుకునే వారని.. పదిహేను రోజులు జాగ్రత్తగా గమనించి.. అదును చూసి ఆటోల్లో ఎక్కించుకొని గ్యాంగ్ రేప్ చేసేవారని తేలింది. ఇప్పటికే ఐదుగురిని ఇదే రీతిలో రేప్ చేశారని చెబుతున్నారు. తమ వివరాలు చెబితే చంపేస్తామని.. సహకరిస్తే అత్యాచారం చేసి వదిలేస్తామని చెప్పి అత్యాచారం చేసేవారిన తేలింది. తమ మాట వినని వారిని విచక్షణారహితంగా కొట్టి అత్యాచారం చేసే వారని తేలింది. ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది.