సచిన్ మీద కోపంతో ఆమెకు సారీ చెబుతున్నారు


భారత దిగ్గజ క్రికెటర్, భారతరత్న సచిన్ టెండుల్కర్ సోషల్ మీడియలో ఎన్నడూ లేని విధంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడిప్పుడు. నొప్పించక తానొవ్వక అన్నట్లుగా సాగిపోయే సచిన్ వివాదాస్పద అంశాల జోలికే వెళ్లడు మామూలుగా. అలాంటి అంశాల మీద స్పందించమన్నా డిప్లమాటిగ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఐతే ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న రైతు ఉద్యమం విషయమై సచిన్ స్పందించిన తీరు అతడిపై ఓ వర్గంలో వ్యతిరేకతకు కారణమైంది.

ఈ ఉద్యమం విషయంలో ప్రస్తుతం దేశం రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. ఓ వర్గం రైతుల వైపు నిలబడగా.. ఇంకో వర్గం ఈ ఉద్యమంలో బయటి శక్తుల ప్రమేయం ఎక్కువైపోయిందని, ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు విదేశీ శక్తులు సైతం చేతులు కలిపాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతు ఉద్యమాన్ని ఆసరా చేసుకుని దేశంలో అల్లర్లకు విదేశీ శక్తులు కుట్ర పన్నినట్లుగా స్వీడన్ పర్యవరణ వేత్త పొరబాటుగా లీక్ చేసిన ఒక పోస్టు కలకలం రేపిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సచిన్ సహా కొందరు క్రీడా, రాజకీయ సెలబ్రెటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ సమయంలో మనమంతా కలిసి కట్టుగా ఉండాలని, బయటి శక్తులు ఈ దేశాన్ని ఏమీ చేయజాలరంటూ ట్వీట్ చేశాడు. ఐతే సచిన్ ట్వీట్ అంత వివాదాస్పదంగా ఏమీ లేదు కానీ.. అతను రైతు ఉద్యమానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి మద్దతుగానే ఈ పోస్ట్ పెట్టాడంటూ ఓ వర్గం అతడిని టార్గెట్ చేసుకుంది. ఈ ట్వీట్‌కు అనేక రకాల భాష్యాలు చెబుతూ సచిన్‌పై విరుచుకుపడిపోయారు నెటిజన్లు. ఈ వ్యవహారం ఊహించని మలుపు తిరిగి రష్యా టెన్నిస్ తార మరియా షరపోవాకు వేలాది మంది క్షమాపణలు చెప్పే వరకు వెళ్లింది.

aసచిన్ ట్వీట్‌కు, షరపోవాకు క్షమాపణ చెప్పడానికి లింకేంటి అనిపించొచ్చు. ఐతే ఎప్పుడో 2015లో షరపోవాను సచిన్ గురించి అడిగితే ఎవరతను అని ఎదురు ప్రశ్న వేయడం మాస్టర్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆ సందర్భంగా ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. ఐతే ఇప్పుడు సచిన్ ప్రభుత్వానికి భజనపరుడు అయిపోయాడని, రైతు ఉద్యమానికి వ్యతిరేకంగా ట్వీట్ చేశాడని, దీంతో అతడి మీద అభిమానమంతా పోయిందని, ఇంతకుముందు సచిన్ ఎవరని అడిగినంందుకు నిన్ను ట్రోల్ చేసినందుకు మన్నించాలని ఆమెను ట్యాగ్ చేసి వేలాది మంది పోస్టులు పెడుతున్నారు. షరపోవా సోషల్ మీడియా పేజీలన్నీ ఈ మెసేజ్‌లతో నిండిపోతుండటం విశేషం.