పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

Silhouette of quarreling man and woman, isolated on a white background. Married couple husband and wife, violence in evening light of home living room

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ వారు ప్ర‌శ్నిస్తారు. దీంతో నిజాలు చెప్పేయ‌డం త‌ప్ప‌దు. కానీ, తాజాగా సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆయుధ క‌ర్మాగారంలో జ‌రిగిన దొంగ‌త‌నం కేసులో చిత్ర‌మైన పరిస్థితి ఏర్ప‌డింది. గ‌త వారం రోజుల కింద‌ట‌.. ఆయుధ‌గారంలోని కొన్ని ఆయుధాలు గ‌ల్లంత‌య్యాయి. వీటిని ఎవ‌రు తీసుకువెళ్లార‌న్న‌ది దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. అనేక కోణాల్లో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు.

చివ‌ర‌కు ఈ కర్మాగారానికి/ఆయుధాగారానికి కాప‌లాగా  ఉన్న హ‌వాల్దార్‌ల ప‌నేన‌ని పోలీసులు గుర్తించారు. ఈ క్ర‌మంలో గ‌తంలో ఇక్క‌డ హ‌వాల్దారులుగా ప‌నిచేసి.. ఆయుధాగారం గుట్టుమ‌ట్లు తెలిసిన ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన టీపీఎస్‌ రావు, తెలంగాణ‌కు చెందిన నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన మల్లేశ్‌ అలియాస్‌ రాజును విచారించారు. వీరిలో ఇద్ద‌రూ తొలుత పోలీసులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేదు. ముఖ్యంగా మ‌ల్లేశ్ అలియాస్ రాజుపై అనుమానాలు బ‌ల‌ప‌డ్డాయి. దీంతో ఆయ‌న‌ను గ‌ట్టిగానే విచారించారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న స‌మాధానం చెప్ప‌లేదని డీజీపీ సీవీ ఆనంద్ వెల్ల‌డించారు.

భార్య ఎంట్రీతో..

తొలుత మ‌ల్లేశ్‌పై అనుమానం ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న ఫోన్లు.. ఇత‌ర డిజిట‌ల్ ప‌రిక‌రాల‌ను స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్‌ను ప‌రిశీలించారు. ఈమెయిల్స్‌ను కూడా నిశితంగా ప‌రిశీలించారు. అయితే.. అప్ప‌టికే కొన్ని డిలీట్ అయ్యాయ‌ని గుర్తించారు. ఈ నేప‌థ్యంలో మొత్తం విష‌యం వెలుగులోకి వ‌స్తున్నా.. మ‌ల్లేశ్ మాత్రం.. మౌనంగానే ఉన్నాడు. ఇక‌, ఈ కేసు విష‌యాన్ని ఆయ‌న స‌తీమ‌ణికి వివ‌రించారు. దీంతో ఆమె ఎంట్రీ ఇచ్చారు. నేరుగా విచార‌ణ కేంద్రానికి వ‌చ్చిన ఆమె.. త‌న భ‌ర్త‌ను ఆమే స్వ‌యంగా గ‌ద్దించి ప్ర‌శ్నించింది. దీంతో అత‌ను నిజాలు ఒప్పేసుకున్నాడు.

ఏం జ‌రిగింది?.

సికింద్రాబాద్‌లో ఉన్న ఆర్మీ ఆయుధ క‌ర్మాగారంలో గ‌త నెల 31న చోరీ జ‌రిగింది. ఈ స‌మ‌యంలో పిస్టల్స్‌, మ్యాగజైన్లు, బుల్లెట్స్‌, బైనాక్యులర్ స‌హా 12 ఆయుధాలు చోరీ అయ్యాయి. దీనిపై ఉన్న‌తాధికారులు సికింద్రాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేప‌థ్యంలో అనుమానితులు అంద‌రినీ అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్ర‌మంలోనే నాగ‌ర్‌క‌ర్నూలుకు చెందిన మాజీ హ‌వాల్దార్ మ‌ల్లేశ్ క‌ద‌లిక‌ల‌పై అనుమానం వ‌చ్చి.. ఆయ‌న‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. కానీ, పోలీసులు చెప్పించ‌లేని నిజాన్ని.. ఆయ‌న భార్య చెప్పించ‌డం గ‌మ‌నార్హం.