బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్ గేట్ల వ‌ద్ద రుసుములు చెల్లించిన త‌ర్వాత‌.. వాహ‌నాలు ముందుకు క‌దులుతాయి. కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు రుసుములు తీసుకుని వాహ‌న‌దారుల‌కు చిల్ల‌ర ఇచ్చి.. టికెట్ ఇచ్చే వ‌ర‌కు వెనుక ఉన్న వాహ‌నాలు నిరీక్షించ‌క త‌ప్పేది కాదు. ఈ ప్ర‌క్రియ‌లో క‌నీసం ఒక్కొక్క వాహ‌నం ప‌ది నిమిషాల చొప్పున నిరీక్షించాల్సి ఉంటుంది.

అయితే.. ఇప్పుడు కొంత మేర‌కు ఫాస్ట్ ట్యాగ్ వ‌చ్చింది. దీంతో ఈ నిరీక్ష‌ణ స‌మ‌యం త‌గ్గింది. అయిన‌ప్ప‌టికీ.. బారికేడ్ల ఏర్పాటును మాత్రం కొన‌సాగిస్తున్నారు. అంటే.. టోల్ ప్లాజాల వ‌ద్ద‌.. ఎంత ఫాస్టాగ్ ఉన్న‌ప్ప‌టికీ.. మ‌లుపుల మాదిరిగా ఉండే బారికేడ్ల‌ను దాటుకుని.. వాహ‌నాలు ముందుకు క‌దులుతున్నాయి. ఇది కూడా.. ఐదు నిమిషాల స‌మ‌యాన్ని తినేస్తోంది. పైగా.. ఈ స‌మ‌యంలో పెట్రోల్‌, డీజిల్ వంటి ఇంధ‌న వినియోగం కూడా పెరిగిపోతోంది. దీనిపై ఇప్ప‌టికే జాతీయ ర‌హ‌దారుల సంస్థ(ఎన్‌హెచ్ఏఐ) అధికారులు నివేదిక‌ల‌ను కేంద్రానికి స‌మ‌ర్పించారు.

దీంతో ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించిన ప్ర‌భుత్వం.. ఇక నుంచి హైవేల‌పై బారికేడ్ల వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేసేందుకు నిర్ణ‌యం తీసుకునేలా ప్ర‌త్యేక క‌మిటీని నియ‌మించింది. ఈ క‌మిటీ ఇప్ప‌టికే త‌న మ‌ధ్యంత‌ర నివేదిక‌ను ర‌హ‌దారుల శాఖ‌కు అప్ప‌గిం చింది. దీని ప్ర‌కారం జాతీయ ర‌హ‌దారుల‌పై బారికేడ్ల‌ను తీసేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ వెల్ల‌డించారు. వ‌చ్చే మార్చి నుంచి దేశ‌వ్యాప్తంగా అన్ని జాతీయ ర‌హ‌దారుల‌పై ఉన్న టోల్ ప్లాజాల వ‌ద్ద బారికేడ్ల‌ను ఎత్తేయ‌నున్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు.

ఏంటి లాభం?
1) టోల్‌ప్లాజాల వద్ద వేచి చూసే సమయం మ‌రింత త‌గ్గుతుంది.
2) అసలు ఆగే అవసరమే ఉండదు.
3) దీనివల్ల సమయం ఆదా అవుతుంది.
4) ఏటా రూ.10 వేల కోట్ల ఆదాయం స‌ర్కారుకు ల‌భిస్తుంది.
5) ఏడాదికి సుమారు రూ.5,250 కోట్ల మేర పెట్రోల్‌/  డీజిల్‌ కూడా ఆదా అవుతుంది.