తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే దీన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ సమ్పరిస్తున్నారు. ఆయన ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్ మీద ఇది రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ వ్యవహారాలు నాగవంశీ చూసుకుంటారా లేక వేరొకరా అనేది పక్కన పెడితే ఒరిజినల్ వెర్షన్ ఆగస్ట్ 7 థియేటర్లకు వచ్చింది. అంటే నెల దాటిపోయింది. నలభై రోజుల తర్వాత మనకు డబ్బింగ్ అవుతోంది.

నిజానికి హనుమాన్ అంశ్ మొదటి వారం పెద్దగా కలెక్షన్లు లేవు. తర్వాత ఒక్కసారిగా పబ్లిక్ టాక్ తో ఊపందుకుంది. అనూహ్యంగా వంద కోట్ల మార్కు దాటేసి డబుల్ సెంచరీ వైపు పరుగులు పెడుతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో జనం పూనకం పట్టినట్టు వెళ్లారు. కొన్ని మల్టీ ప్లెక్సుల్లో షో అయ్యాక భక్తి సంఘాలు అదే పనిగా ప్రసాదాలు, హనుమాన్ చాలీసా పుస్తకం, మంచి నీళ్ల బాటిల్ లాంటివి ఉచితంగా పంచి పెట్టారు. వాటి తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో తెగ తిరిగాయి.

అంతగా హనుమాన్ అంశ్ లో ఏముందనే ఆసక్తి జనంలో లేకపోలేదు. గతంలో చావా కూడా బాగా ఆలస్యంగా డబ్ చేస్తే ఓ మోస్తరు కలెక్షన్లు తెచ్చి పెట్టింది. అప్పటికే హిందీ వెర్షన్ ని అధిక సంఖ్యలో థియేటర్లలో చూసేయడం వల్ల వావ్ అనిపించే వసూళ్లు రాలేదు. మరి హనుమాన్ అంశ్ ఏం చేస్తుందో చూడాలి. స్వతంత్రం రాకముందు బ్రిటిష్ పాలనలో ఆధ్యాత్మిక చింతనను దోహదం చేసిన నీమ్ కరోలి బాబా జీవిత కథ ఆధారంగా హనుమాన్ అంశ్ రూపొందించారు దర్శకుడు డాక్టర్ విశాల్ చతుర్వేది.

కాకపోతే ప్యారడైజ్ కు కేవలం వారం రోజుల ముందు హనుమాన్ అంశ్ రిలీజ్ చేయడం కమర్షియల్ గా ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. సినిమా విపరీతంగా నచ్చడం వల్లే త్రివిక్రమ్ పంపిణీ బాధ్యతలు తీసుకున్నారని ఇన్ సైడ్ టాక్. కేవలం రెండు నుంచి మూడు కోట్ల మధ్య బడ్జెట్ లో రూపొందిన ఈ డివోషనల్ వండర్ ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టించడం అనూహ్యం. మరి తెలుగులో కూడా అలాంటి ఫలితం సాధిస్తుందేమో చూడాలి.