కూలిపోయిన హాస్టల్… అగ్రిమెంట్‌లో మాత్రం ‘మాకు బాధ్యత లేదు’!

ఢిల్లీలో హాస్టల్ భవనం కూలిపోయిన ఘటనలో ఇప్పుడు మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఏడుగురు మరణించిన విషయం తెలిసిందే. అయితే విద్యార్థుల నుంచి మూడు నెలల సెక్యూరిటీ డిపాజిట్, ఒక నెల అడ్వాన్స్ రెంట్ తీసుకున్న హాస్టల్ యాజమాన్యం.. ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం తమకు బాధ్యత లేదంటూ అగ్రిమెంట్‌లోనే ఒక షరతు పెట్టింది. ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో కూలిపోయిన ‘హాస్టల్ డేజ్’ రెంట్ అగ్రిమెంట్ ఇప్పుడు బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అగ్రిమెంట్‌లో విద్యార్థులు పాటించాల్సిన రూల్స్ మాత్రం చాలా ఉన్నాయి. గడువు ముగియకముందే హాస్టల్ ఖాళీ చేస్తే సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి ఇవ్వరు. ఫర్నిచర్‌కు నష్టం జరిగితే ఆ డబ్బులు కూడా డిపాజిట్ నుంచే తీసుకుంటారు. గోడలకు పోస్టర్లు, స్టిక్కర్లు కూడా అంటించకూడదు. కానీ విద్యార్థికి ఏదైనా ప్రమాదం జరిగినా, ప్రాణనష్టం జరిగినా పీజీ అధికారులు బాధ్యత వహించరనే షరతు కూడా అందులో ఉంది.

ఇంతకీ ఈ హాస్టల్ ఉన్న భవనం పరిస్థితి చూస్తే మరిన్ని విషయాలు బయటపడుతున్నాయి. ఐదు అంతస్తుల ఈ భవనం దాదాపు 50 ఏళ్ల పాతది. ఉన్న స్థలంలో రెండు అంతస్తుల నిర్మాణానికి మాత్రమే అనుమతి ఉండగా, ఐదు అంతస్తులు నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి ఆమోదించిన బిల్డింగ్ ప్లాన్ కూడా లేదని సమాచారం.

భవనం కూలిన సమయంలో బేస్‌మెంట్‌లో కూడా పనులు జరుగుతున్నాయి. శిథిలాల నుంచి బయటకు తీసిన వారిలో కార్మికులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా పలువురు గాయపడ్డారు. భవనం యజమానిని పోలీసులు అరెస్ట్ చేయగా, నిర్లక్ష్యంపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసింది. ఈ ఘటన తర్వాత ఢిల్లీ హైకోర్టు కూడా రంగంలోకి దిగింది. నగరంలోని పీజీలు, హాస్టళ్లను తనిఖీ చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించింది. ఎన్ని భవనాలు సరైన అనుమతులతో నడుస్తున్నాయి, ఒక్కో హాస్టల్‌లో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారు అనే వివరాలు కూడా సేకరించాలని చెప్పింది.