నేపాల్ వరదలు సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. వేలాది మంది పౌరులు, పాఠశాల విద్యార్థులు గల్లంతయ్యారు. రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ లేదు. ఆశలు కోల్పోయిన కొంతమంది గల్లంతయిన తమవారి దిష్టి బొమ్మలు తయారు చేసి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఇలాంటి విషాదకర పరిస్థితిలో శిధిలాలకింద చిక్కుకొని సజీవంగా వున్నవారి ఆచూకీ లభించడం, పూర్తిగా బురదలో కురుకొనిపోయిన కొంతమంది సజీవంగా ఉండటం ఆశ్చర్యం, ఆనందం కలిగిస్తుంది. ఈ క్రమంలో తొమ్మిది రోజుల తర్వాత ఇద్దరు వ్యక్తులను రెస్క్యూ టీం రక్షించినట్లు వార్తలు వస్తున్నాయి.
రాసువా జిల్లాలోని త్రిశూలి 3ఏ హైడ్రోపవర్ ప్రాజెక్టు సొరంగం నుంచి మనుషుల మాటలు విన్నట్లు నేపాల్ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ సభ్యుడు శ్రీరామ్ న్యూపానే సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు ఇద్దరి ప్రాణాలను కాపాడింది. ఈ పోస్టుకు స్పందించిన రెస్క్యూ టీం హుటాహుటిన అక్కడకు చేరుకుంది. లోపల నుంచి మాటలు వినిపిస్తుందటంతో సొరంగం లోపల మనుషులు చిక్కుకున్నట్లు నిర్దారించింది.
పూర్తిగా దెబ్బతిన్న సొరంగం నుంచి బురదను తొలిగించింది. లోపల సజీవంగా వున్న ఇద్దరు వ్యక్తులను కాపాడింది. ప్రాణాలతో బయట పడిన వారిని సంజయ్ సాహ్, కబీర్ మహర్జన్ గా గుర్తించారు. సాహ్ మెకానికల్ ఫోర్మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడని, కబీర్ మెకానికల్ విభాగంలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నట్లు తెలిసింది.
ఈ సొరంగంలో మరికొందరు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆగస్టు 26 తర్వాత ఆకస్మికంగా వచ్చి పడిన వరదలకు త్రిశూల్ 3ఏ కేంద్రంలో 50 మంది వరకు వున్నట్లు అధికారులు చెబుతున్నారు. వారిలో అత్యధికులు ఈ సొరంగంలో వున్నట్లు నిర్దారించిన అధికారులు వారిని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే విపరీతంగా చేరిన బురద, భారీగా అడ్డు పడిన శిధిలాలు సిబ్బందికి చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ప్రత్యేక పరికరాలను, నిపుణులను రంగంలోకి దించినట్లు అధికారులు చెబుతున్నారు.
మరోవైపు రుసువా, నువాకోట్ జిల్లాల్లో మహా విషాదం నెలకొంది. ఇక్కడ 12 పాఠశాలలు ధ్వంసం అయ్యాయి. 600 మందికి పైగా విద్యార్థులు గల్లంతయ్యారు. విద్యార్థులతో పాటుగా 22 మంది ఉపాధ్యాయులు కూడా కనిపించడం లేదు. వీరి సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. తలిదండ్రులు వీరి ఆచూకీ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పిల్లలను తలుచుకొని కన్నీరుమున్నీరవుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates