హైదరాబాద్ – విజయవాడ ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు.

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఫ్రెష్ బస్ ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన అనంతరం డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. మృతుల వివరాలు, గాయపడిన వారి పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.