ఇండియాలో క్రికెట్ పిచ్చి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇంతకుముందున్నంత ఇంటెన్స్ ఫ్యాన్స్ ఇప్పుడు లేకపోవచ్చు. ఒక ఓటమితో కొన్ని రోజుల పాటు వేదనకు గురి కావడం ఇప్పుడు తగ్గిపోయి ఉండొచ్చు. క్రికెట్ మ్యాచ్ల మోతాదు బాగా పెరిగిపోవడం ఇందుకు కారణం.
అయినా సరే.. ఇండియన్ టీమ్స్ ఎక్కడ ఆడుతున్నా అభిమానులు ఒక కన్నేసి ఉంచుతారు. ఆదివారం రోజు మ్యాచ్లు ఉంటే.. టీవీల ముందు కూలబడిపోతారు. ఇలా ఈ సండే రెండు ముఖ్యమైన మ్యాచ్లు చూసిన వాళ్లకు తీవ్ర నిరాశ తప్పలేదు. ఇటు పురుషుల జట్టు, అటు మహిళల బృందం కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేయడంతో పరాజయాలు తప్పలేదు.
ఐర్లాండ్ చేతిలో తొలి టీ20లో అనూహ్య పరాభవం పాలైన భారత పురుషుల టీ20 జట్టు .. రెండో మ్యాచ్లోనూ పుంజుకోలేకపోయింది. పసికూన అనదగ్గ జట్టు చేతిలో వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓడి సిరీస్ను 0-2తో కోల్పోయింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఈ మ్యాచ్లో అయినా ఆడిస్తారేమో అనుకుంటే అది జరగలేదు.
కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు తొలి సిరీస్లోనే పెద్ద షాక్ తగిలింది. శ్రేయస్తో పాటు అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి మెరుపు వీరులు చాలామంది ఉన్నా భారత జట్టు 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (55) పోరాడినా ఫలితం లేకపోయింది.
మరోవైపు గత ఏడాది వన్డే ప్రపంచకప్ గెలిచి.. టీ20 ప్రపంచకప్లోనూ మంచి అంచనాలతో బరిలోకి దిగిన భారత అమ్మాయిలు గ్రూప్ దశలోనే నిష్క్రమించారు. సెమీస్ చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆస్ట్రేలియా ముందు 171 పరుగుల లక్ష్యం నిలవగా.. ఆ జట్టు 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులే చేయడంతో భారత్ గెలుస్తుందనిపించింది. కానీ తర్వాత భారత బౌలింగ్ గాడి తప్పడంతో ఓటమి తప్పలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates