రీ-నీట్… ఇంత చేసినా మళ్లీ సందేహాలు, ప్రశ్నలు!?

రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి కూడా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద చోటుచేసుకున్న ఘటనలు తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. సమయం మించిపోయిందనే కారణంతో తన కుమార్తెను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదంటూ ఓ తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. మరోచోట పరీక్షకు అనుమతి ఇవ్వాలని అధికారుల కాళ్లు పట్టుకుని వేడుకున్న తండ్రి దృశ్యాలు చర్చనీయాంశమయ్యాయి.

ఇదే సమయంలో బీహార్‌లో రీ-నీట్‌కు సంబంధించిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. లఖిసరాయ్ జిల్లాలో నిర్వహించిన దాడుల్లో అసలు అభ్యర్థుల స్థానంలో నకిలీ అభ్యర్థులతో పరీక్ష రాయించే ముఠాను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం 24 మందిని అరెస్టు చేశారు. వీరిలో దేశంలోని ప్రముఖ వైద్య విద్యాసంస్థలకు చెందిన మెడికల్ విద్యార్థులు కూడా ఉండటం సంచలనంగా మారింది.

జూన్ 21న దేశవ్యాప్తంగా రీ-టెస్ట్ నిర్వహించిన మరుసటి రోజే పోలీసులు దాడులు నిర్వహించారు. ప్రాథమిక విచారణలో మోసపూరిత మార్గాల ద్వారా మెడికల్ సీట్లు ఇప్పిస్తామంటూ ఒక్కో అభ్యర్థి నుంచి రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసినట్లు వెల్లడైంది.

అసలు విద్యార్థుల తరపున ఇతరులను పరీక్షకు పంపించే ప్రాక్సీ నెట్‌వర్క్‌ను పోలీసులు గుర్తించారు. బయోమెట్రిక్ ధృవీకరణ ప్రక్రియలో లోపాలు జరిగి ఉండొచ్చనే అనుమానంతో పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ తనిఖీల బాధ్యతలు నిర్వహించిన ఏజెన్సీకి చెందిన 14 మంది ఉద్యోగులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదే గ్యాంగ్ గతంలో కూడా పేపర్ లీక్ వివాదాల్లో పాత్ర పోషించినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. మరోవైపు నకిలీ అభ్యర్థులతో పరీక్షలు రాయించే ప్రయత్నాలకు సంబంధించి వేర్వేరు కేసుల్లో సుమారు 30 మందిని బీహార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

రీ-నీట్‌ను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నప్పటికీ, వరుసగా బయటపడుతున్న అక్రమాలు పరీక్షా వ్యవస్థ విశ్వసనీయతపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ పరీక్షలో మళ్లీ మోసాలు వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది.