డేవిడ్ వార్నర్.. తనకు తనే ఇచ్చేసుకున్నాడు


భారత క్రికెట్ అభిమానులకు.. ముఖ్యంగా తెలుగు క్రికెట్ ప్రియులకు ప్రస్తుతం అంత్యంత ఇష్టమైన క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా డేవిడ్ వార్నర్ పేరు చెప్పేయొచ్చు. తెలుగువారి ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొన్నేళ్లుగా అతనే కెప్టెన్. ప్రతి సీజన్లోనూ అద్భుతమైన ప్రదర్శనతో తన జట్టును ముందుకు నడిపిస్తూ అభిమానులను అలరిస్తుంటాడతను. 2016లో తన జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ కూడా అందించాడు వార్నర్.

ఇక ఈ ఏడాది లాక్ డౌన్ టైంలో అతను మనవాళ్లకు అందించిన ఎంటర్టైన్మెంట్ అంతా ఇంతా కాదు. టిక్‌టాక్‌లో పాపులర్ తెలుగు పాటలకు అతను డ్యాన్స్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. బుట్టబొమ్మా, మైండ్ బ్లాక్ పాటలకు వార్నర్ తన భార్యా పిల్లలతో కలిసి వేసిన స్టెప్పులు ఎంతగా అలరించాయో తెలిసిందే. టిక్‌ టాక్‌లో, ఇతర సోషల్ మీడియాల్లో ఈ వీడియోలు మామూలు స్పందన రాలేదు.

ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్ తనకు తాను 2020 సంవత్సరానికి ‘ఐసీసీ మేల్ టిక్‌టాకర్ ఆఫ్ ద డెకేడ్’ పురస్కారాన్ని ఇచ్చుకోవడం విశేషం. అతనిలా అవార్డు ఇచ్చుకోవడానికి కారణం లేకపోలేదు. ఇటీవలే ఐసీసీ 2011-20 దశాబ్దానికి వివిధ ఫార్మాట్లలో ఉత్తమ క్రికెటర్లను ఎంపిక చేసింది. వారికి పురస్కారాలు ప్రకటించింది. మన విరాట్ కోహ్లీనే మేల్ క్రికెటర్ ఆఫ్ ద డెకేడ్‌గా నిలిచాడు. అలాగే ఈ దశాబ్దానికి ఉత్తమ వన్డే ఆటగాడిగానూ పురస్కారం అందుకున్నాడు. అలాగే మూడు ఫార్మాట్లకు ఐసీసీ ఎంపిక చేసిన దశాబ్దపు జట్లలో చోటు దక్కించుకోవడమే కాక.. టెస్టు జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ధోనీ వన్డే, టీ20 జట్ల కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వార్నర్ విషయానికొస్తే అతను ఐసీసీ దశాబ్దపు వన్డే, టెస్టు జట్లలో చోటు దక్కించుకున్నాడు.

ఐతే వాటి సంగతలా ఉంచితే.. ఇప్పుడు తనకు తాను ‘ఐసీసీ మేల్ టిక్ టాకర్‌ ఆఫ్ ద డెకేడ్’ అంటూ పురస్కారం ఇచ్చుకుని ఇన్‌స్టాగ్రమ్ స్టోరీస్‌లో దాన్ని షేర్ చేయడం ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ అవార్డుకు వార్నర్ నూటికి నూరు శాతం అర్హుడు అంటూ అతణ్ని పొగిడేస్తూ తన టిక్ టాక్ వీడియోలు షేర్ చేస్తున్నారు జనాలు.