చైనాలో నాలుగేళ్ల క్రితం జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ MU5735 ప్రమాదానికి కాక్పిట్లో ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన గొడవే కారణమని, ఆ గొడవలో ఒకరు ఉద్దేశపూర్వకంగానే ఇంజిన్లకు ఇంధనం అందకుండా స్విచ్ ఆఫ్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) నివేదికలోని సమాచారం ప్రకారం, విమానం గాలిలో ఉన్నప్పుడే రెండు ఇంజిన్ల ఫ్యూయల్ స్విచ్లు ‘రన్’ పొజిషన్ నుండి ‘కటాఫ్’ పొజిషన్కు మారినట్లు తెలుస్తోంది. దీనివల్ల విమానం ఒక్కసారిగా 29,000 అడుగుల ఎత్తు నుండి నిలువుగా కిందికి పడిపోయి 132 మందిని బలితీసుకుంది.
అసలు ఆ కాక్పిట్లో ఏం జరిగిందనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. సాధారణంగా బోయింగ్ 737 విమానాల్లో ఇంజిన్ ఆపడం అంత తేలికైన పని కాదు. పైలట్ ఆ స్విచ్ను పైకి ఎత్తి మరీ మార్చాల్సి ఉంటుంది. అంటే ఎవరో కావాలనే ఇంధనాన్ని నిలిపివేసినట్లు డేటా సూచిస్తోంది. ఈ ప్రమాదం వెనుక పైలట్ల మధ్య ఉన్న గొడవలే కారణమని ప్రచారం జరుగుతున్నా, చైనా అధికారులు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించకుండా దాచిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదానికి ముందు విమానంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని చైనా పౌర విమానయాన సంస్థ CAAC గతంలోనే స్పష్టం చేసింది.
ప్రమాదం జరిగిన తర్వాత కాక్పిట్ వాయిస్ రికార్డర్లను విశ్లేషణ కోసం చైనా అధికారులకు అప్పగించారు. కానీ ఇప్పటివరకు చైనా నుండి ఎలాంటి అధికారిక తుది నివేదిక బయటకు రాలేదు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఏడాది లోపే నివేదిక ఇవ్వాల్సి ఉన్నా, చైనా మాత్రం మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అమెరికా మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషించినప్పుడు విమానం కుప్పకూలడానికి కాక్పిట్ నుండి ఉద్దేశపూర్వకంగా చేసిన కమాండ్సే కారణమని ప్రాథమికంగా గుర్తించారు.
ఈ విషాదం జరిగి ఇన్నేళ్లవుతున్నా, బాధితుల కుటుంబాలకు మాత్రం ఇప్పటికీ సరైన సమాధానం దొరకలేదు. విమానం దాదాపు నిలువుగా కొండల్లోకి దూసుకుపోయిందని, సెకన్ల వ్యవధిలోనే అంతా ముగిసిపోయిందని విచారణలో తేలింది. అయితే, చైనా మాత్రం తమ విచారణ ఇంకా కొనసాగుతోందని చెబుతూ దాటవేస్తోంది. పైలట్ల మధ్య గొడవ కారణంగానే ఇంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయనే వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. నిజంగా అది పైలట్ల మధ్య గొడవేనా లేక మరేదైనా కారణమా అనేది చైనా నోరు విప్పితేనే తెలుస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates