ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 32 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించగా, కేకేఆర్ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది.
నిజానికి ఈ పిచ్ సెకండ్ బ్యాటింగ్కు స్వర్గధామం వంటిది. డ్యూ ప్రభావం వల్ల బౌలర్లు బంతిని పట్టుకోవడమే కష్టమైన చోట, 230 పరుగులనైనా ఈజీగా ఛేజ్ చేయొచ్చని విశ్లేషకులు భావించారు. కానీ, కనీసం 200 పరుగుల మార్కును కూడా అందుకోలేక కేకేఆర్ బ్యాటర్లు మైదానంలో నిస్సహాయంగా కనిపించడం అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది.
కేకేఆర్ లైనప్లో సుమారు ఎనిమిది మంది పక్కా హిట్టర్లు ఉన్నారు. కానీ రన్ రేట్ 15, 20కి చేరుతున్నా సరే, ఎక్కడా వారిలో గెలవాలనే కసి కనిపించలేదు. మిగతా జట్లలో 20 ఏళ్ల కుర్రాళ్లు ఆఖరి బంతి వరకు పోరాడి అసాధ్యమైన మ్యాచ్లను గెలిపిస్తుంటే, కేకేఆర్ సీనియర్లు మాత్రం ‘మేము ఓడిపోతాం’ అని ముందే డిసైడ్ అయినట్లు ఆడారు.
ముఖ్యంగా భారీ హిట్టర్లుగా పేరున్న రోవ్మన్ పావెల్ (31), రమణదీప్ సింగ్ (35) క్రీజులో ఉన్నా, వారు మ్యాచ్ గెలవడం కంటే నెట్ రన్ రేట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు అనిపించింది. అసలు విజయం కోసం వారు ప్రయత్నించినట్లు ఎక్కడా కనిపించలేదు.
అత్యంత ఖరీదైన ఆటగాడు కెమెరాన్ గ్రీన్ గోల్డెన్ డకౌట్ అవ్వడం కేకేఆర్ ను దెబ్బ కొట్టింది. ఇక టీమిండియా స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ (6) మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. ఒకరు విఫలమైతే మరొకరు బాధ్యత తీసుకుని మ్యాచ్ను మలుపు తిప్పాలి కానీ, కేకేఆర్ టీమ్లో ఆ కాన్ఫిడెన్స్ సున్నా అని అర్థమైంది. అజింక్యా రహానే (28), రఘువంశీ (27) కాసేపు పోరాడినా అది కేవలం స్కోరు బోర్డును పెంచడానికి మాత్రమే సరిపోయింది. గెలవాలనే ఉద్దేశంతో బరిలోకి దిగితే 193 పరుగుల లక్ష్యం ఈ పిచ్పై కేకేఆర్కు ఏమాత్రం పెద్దది కాదు.
చెన్నై బౌలింగ్ విషయానికి వస్తే, నూర్ అహ్మద్ తన స్పిన్ మ్యాజిక్తో 3 వికెట్లు తీసి కేకేఆర్ పని పట్టాడు. అన్షుల్ కాంబోజ్ కూడా 2 వికెట్లతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి బౌలింగ్లో కేకేఆర్ బ్యాటర్లు సింగిల్స్ తీయడానికి కూడా నానా తంటాలు పడ్డారు. అంతకుముందు చెన్నై బ్యాటింగ్లో సంజూ శామ్సన్ (48), డెవాల్డ్ బ్రెవిస్ (41) రాణించడంతో 192 పరుగుల గౌరవప్రదమైన స్కోరు దక్కింది. ఆయుష్ మ్హత్రే 17 బంతుల్లోనే 38 పరుగులు చేసి ఇన్నింగ్స్కు మంచి ఊపు తెచ్చాడు.
కేకేఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ జట్టుపై చీవాట్లు పెడుతున్నారు. “ఇంతమాత్రం దానికి ఐపీఎల్ ఆడడం దేనికి?” అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. ఇప్పటివరకు కేకేఆర్కు వచ్చిన ఆ ఒక్క పాయింట్ కూడా పంజాబ్తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడం వల్లే వచ్చిందంటే వారి ప్రదర్శన ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎనిమిది మంది హిట్టర్లు ఉన్నా, కనీసం పోరాట పటిమ చూపని కేకేఆర్.. మేనేజ్మెంట్ మార్పులు చేయకపోతే ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ ఆశలు గగనమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates
