బెంగళూరులో టెకీ జంట సూసైడ్… ఇద్దరు తెలుగువారే

షాకింగ్ విషాద ఉదంతం చోటు చేసుకుంది. కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతంలో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే. బెంగళూరులోని సోమవారం రాత్రి చోటు చేసుకున్న వరుస ఆత్మహత్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

తెలంగాణలోని సిద్దిపేట జిల్లాకు చెందిన ఐటీ ఉద్యోగి కుంట భానుచందర్ రెడ్డి (32), తెలంగాణలోని హైదరాబాద్ కు చెందిన బీబీ షాజియా సిరాజ్ (31) గడిచిన తొమ్మిదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకున్నట్లుగా చెబుతున్నా.. వీరికి సంబంధించిన వివరాలు ఇరువురు తల్లిదండ్రులకు తెలీదని చెబుతున్నారు.

బీబీ షాజియా సిరాజ్ విషయానికి వస్తే.. ఆమె ఐబీఎం కంపెనీలో ఉన్నత ఉద్యోగంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరు బెంగళూరులోని కొత్తనూరు ప్రాంతంలోని ఒక హైరైజ్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. సోమవారం రాత్రి భానుచందర్ రెడ్డి తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని ఎంతకూ రాకపోవటంతో.. అతని భార్యగా చెబుతున్న షాజియా సిరాజ్ చుట్టుపక్కల వారితో పాటు సెక్యూరిటీ సాయంతో తలుపు బద్ధలు కొట్టి చూడగా.. అతను సూసైడ్ చేసుకున్నట్లుగా గుర్తించారు.

భానుచందర్ రెడ్డి మృతదేహాన్ని చూసి తట్టుకోలేకపోయిన ఆమె.. ఆ క్షణంలోనే అదే అపార్ట్ మెంట్ లోని 17వ అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు విడిచారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. కొంతకాలంగా ఉంటున్న వీరి వివరాలు అప్పుడే అక్కడి వారికి తెలిశాయి. భానుచందర్ రెడ్డి తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని.. తనకున్న ఆరోగ్య సమస్యలు.. మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా లేఖలో పేర్కొన్నారు.

ఈ జంట ఇద్దరు గడిచిన తొమ్మిదేళ్లుగా లివింగ్ రిలేషన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. తొలుత సహజీవనం కొంతకాలం క్రితం వీరిద్దరూ పెళ్లి చేసుకున్నా..ఆ విషయాలేవీ వారి ఇళ్లల్లో తెలీదని చెబుతున్నారు. కొంతకాలంగా వీరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయని.. అదే ఆత్మహత్య వరకు వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు.

భానుచందర్ రెడ్డి ఏ సంస్థలో పని చేస్తారన్న సమాచారం ఇంకా బయటకు రాలేదు. వీరిద్దరి ఆత్మహత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాల్ని సేకరిస్తున్నారు. వీరి మరణాలపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇరువురు కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత వీరికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని చెబుతున్నారు.