వార్ ఎఫెక్ట్… వంటింట్లో బాదుడే బాదుడు

యుద్ధం.. అక్కడి వారిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపితే.. మనపై పరోక్ష ప్రభావాన్ని చూపిస్తోంది. గ్యాస్, పెట్రోల్ ధరలు. పెరుగుతాయని నిపుణులు ముందుగానే అంచనా వేశారు. అయితే రాత్రికి రాత్రే గ్యాస్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఎందుకు కారణంగా కనిపిస్తోంది.

చమురు సంస్థలు ప్రకటించిన తాజా నిర్ణయం ప్రకారం, 14.2 కిలోల గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.60 పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో గృహ సిలిండర్ ధర రూ.965కు చేరింది. అలాగే 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.115 పెంచడంతో ఇది రూ.2045.50కు పెరిగింది. కొత్త ధరలు మార్చి 7 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఆయిల్ కంపెనీలు తెలిపాయి.

ఈ ధరల పెంపు కారణంగా గృహ వినియోగదారులతో పాటు హోటళ్లు, చిన్న వ్యాపారాలపై అదనపు భారం పడనుంది. ఇటీవల మార్చి 1న కమర్షియల్ సిలిండర్ ధరను రూ.31 మేర తగ్గించినప్పటికీ, ఇప్పుడు భారీగా పెరగడం గమనార్హం. అయితే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా అందించే గ్యాస్ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి.

ఇక అంతర్జాతీయంగా ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా చమురు మార్కెట్లలో అస్థిరత పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మార్గంలో ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో ధరలు పెరుగుతున్నాయని భావిస్తున్నారు. ఒకవేళ అటువంటిదే జరిగి పెట్రోల్ ధరలు పెరిగితే మధ్య తరగతి సామాన్యులకు చుక్కలు కనిపిస్తాయి.