డిల్లీ వేదికపై చైనా రోబో.. ఏంటి వివాదం?

ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్‌లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ‘ఓరియన్’ అని పిలుచుకుంటున్న ఈ రోబోను తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో సొంతంగా తయారు చేశామని ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు మీడియా ముందు చెప్పడం ఈ గొడవకు కారణమైంది. అయితే అది చూసిన నెటిజన్లు, ఇది చైనాకు చెందిన ‘Unitree’ కంపెనీ తయారు చేసిన రోబో అని, ఆన్‌లైన్‌లో కేవలం రెండు మూడు లక్షలకే దొరుకుతుందని ఆధారాలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

ఈ వివాదం ఎంత ముదిరిందంటే, చైనా టెక్నాలజీని తమదిగా చెప్పుకుని దేశ పరువు తీశారనే కారణంతో ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఆ యూనివర్సిటీ స్టాల్‌ను ఖాళీ చేయమని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఒకవైపు ప్రొఫెసర్ దీనిని మేమే తయారు చేశామని చెబుతుంటే, మరోవైపు యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం అసలు తాము అలా ఎప్పుడూ క్లెయిమ్ చేయలేదని రివర్స్ గేర్ వేసింది. దీనివల్ల అసలు నిజమేంటో తెలియక చాలామంది గందరగోళానికి గురయ్యారు.

చివరకు గల్గోటియాస్ యూనివర్సిటీ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. తాము ఈ రోబోను తయారు చేయలేదని, విద్యార్థులు నేర్చుకోవడానికి చైనా నుంచి కొనుగోలు చేశామని ఒప్పుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అధునాతన టెక్నాలజీని క్యాంపస్‌కు తీసుకురావడం ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని, భవిష్యత్తులో మన దేశంలోనే ఇలాంటి రోబోలను తయారు చేసే మేధావులను తాము తీర్చిదిద్దుతున్నామని సర్దిచెప్పుకొచ్చింది.

యూనివర్సిటీ వివరణ ఎలా ఉన్నా, చైనా రోబోకు భారత్ పేరు పెట్టి ప్రదర్శించడంపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. ఇన్వొవేషన్ అంటే కొత్తగా కనిపెట్టడం కానీ, వేరే దేశాల ప్రొడక్టులను తెచ్చి మనవని చెప్పుకోవడం కాదని నెటిజన్లు చురకలు వేస్తున్నారు. విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచడం మంచిదే అయినా, నిజాయితీగా అది ఎక్కడి నుంచి వచ్చిందో చెబితే ఇంత గొడవ జరిగేది కాదని మరికొందరు భావిస్తున్నారు.