నేపాల్ బలం వెనుక కారణమేంటి?

క్రికెట్ ఆటను ప్రపంచానికి పరిచయం చేసింది ఇంగ్లాండ్, అలాంటి దిగ్గజ జట్టుకే నేపాల్ చుక్కలు చూపించడం అంటే అది మామూలు విషయం కాదు. మొన్నటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై కేవలం 4 పరుగుల తేడాతో నేపాల్ ఓడిపోయి ఉండొచ్చు కానీ, ఆ గెలుపు కంటే నేపాల్ చూపించిన తెగువకే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఈ పసికూన జట్టు ఇప్పుడు స్ట్రాంగ్ టీమ్ గా ఎదగడం వెనుక పక్కా ప్లానింగ్ ఉంది.

గత టీ20 వరల్డ్ కప్ తర్వాత గమనిస్తే, విన్నింగ్ పర్సంటేజీలో భారత్ తర్వాత 71 శాతంతో నేపాల్ రెండో స్థానంలో ఉంది. ఆడింది చిన్న జట్లతో అయినా నేర్చుకున్న పాఠాలు పెద్దవే. యూఏఈ, కెనడా వంటి జట్లను ఓడించి విజయాలను ఒక అలవాటుగా మార్చుకున్నారు. నేపాల్ ప్రీమియర్ లీగ్ (NPL) ద్వారా విదేశీ ఆటగాళ్లతో కలిసి ఆడి తమ నైపుణ్యాన్ని పెంచుకున్నారు. ఈ అనుభవమే ఇప్పుడు ఇంగ్లాండ్ వంటి బలమైన జట్టును గెలుపు అంచు వరకు తీసుకెళ్లి భయపెట్టేలా చేసింది.

వాంఖడే స్టేడియంలో నేపాల్ అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. స్టేడియం మొత్తం తమ దేశ జెండాలతో నింపేసి, ప్రతి బంతికి ఆటగాళ్లలో జోష్ నింపారు. తమ ఫ్యాన్స్ ఇస్తున్న ఈ సపోర్టే నేపాల్ ప్లేయర్లు భయం లేకుండా ఆడటానికి ప్రధాన కారణం. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఓటమి బాధలో ఉన్న ప్లేయర్లు స్టేడియం మొత్తం తిరిగి తమ అభిమానులకు కృతజ్ఞతలు తెలపడం అందరినీ ఆకట్టుకుంది.

నేపాల్ కు అసలైన పరీక్ష ఇకపై జరగబోయే మ్యాచ్‌ల్లోనే ఉంది. ఫిబ్రవరి 12న ఇటలీ, 15న వెస్టిండీస్, 17న స్కాట్లాండ్‌తో నేపాల్ తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌లు కూడా వాంఖడేలోనే జరగడం వారికి కలిసొచ్చే అంశం. ఇటలీ, స్కాట్లాండ్‌పై గెలిచే సత్తా ఈ జట్టుకు ఉంది. ఒకవేళ ఫ్యాన్స్ సపోర్ట్‌తో వెస్టిండీస్‌ను కూడా దెబ్బకొడితే నేపాల్ నేరుగా ‘సూపర్ 8’ కి చేరుకోవడం ఖాయం. పసికూన అని తక్కువ అంచనా వేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఇంగ్లాండ్ మ్యాచ్ నిరూపించింది. ఇప్పుడున్న ఫామ్ చూస్తుంటే నేపాల్ కేవలం ఒక చిన్న జట్టు కాదు, ఏ పెద్ద జట్టునైనా మట్టి కరిపించగల సత్తా ఉన్న టీమ్ అని అర్థమవుతోంది. మరి ఈ అద్భుతమైన ప్రయాణం మున్ముందు ఇంకెన్ని సంచలనాలకు దారితీస్తుందో వేచి చూడాలి.