ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్యవంశీ

2026 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఆటాడుకుంటూ కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించి వీర కుమ్ముడు కుమ్మాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 15 భారీ సిక్సర్లు ఉండటం గమనార్హం. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించడమే కాకుండా, అండర్-19 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత చిరస్మరణీయమైన నాక్ ఆడాడు.

వైభవ్ సూర్యవంశీ వచ్చే మార్చి 21 నాటికి 15వ ఏట అడుగుపెట్టబోతున్నాడు. ఈ చిన్న వయసులోనే అంతర్జాతీయ వేదికపై ఇంతటి పరిణతితో కూడిన బ్యాటింగ్‌ను ప్రదర్శించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఫైనల్ వంటి ఒత్తిడి ఉన్న మ్యాచ్‌లో 218.75 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం మామూలు విషయం కాదు. ఈ మ్యాచులో సూర్యవంశీ విధ్వంసానికి ఒక అరుదైన ప్రపంచ రికార్డు కూడా బద్దలైంది. ఒకే అండర్-19 ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా అతను చరిత్ర సృష్టించాడు. 

గతంలో సౌతాఫ్రికా ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ పేరిట ఉన్న 18 సిక్సర్ల రికార్డును అధిగమించి, ఈ టోర్నీలో ఏకంగా 20 సిక్సర్లతో టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లందరినీ బెంబేలెత్తిస్తూ గ్రౌండ్ నలుమూలల బాదిన అతని షాట్లకు హారారే స్పోర్ట్స్ క్లబ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాక, ఓపెనర్ ఆరోన్ జార్జ్ త్వరగానే అవుట్ అయినా వైభవ్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కెప్టెన్ ఆయుష్ మత్రేతో కలిసి రెండో వికెట్‌కు 142 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్ 79 పరుగులు చేసిందంటే అది కేవలం వైభవ్ సూర్యవంశీ ఇచ్చిన దూకుడైన ఆరంభం వల్లే సాధ్యమైంది. 

ఈ యువ ఆటగాడి బ్యాటింగ్ చూస్తుంటే టీమిండియాకు భవిష్యత్ స్టార్ దొరికాడని చెప్పవచ్చు. వైభవ్ సూర్యవంశీ కేవలం ప్రపంచకప్‌లోనే కాకుండా గత ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ అత్యధిక పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతి చిన్న వయసులోనే ఐపీఎల్ (రాజస్థాన్ రాయల్స్) రంజీ ట్రోఫీలో అడుగుపెట్టిన రికార్డు కూడా ఇతని పేరిటే ఉంది. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్‌లో 175 పరుగులతో వీరవిహారం చేసి కీలక పాత్ర పోషించాడు.