రూ.440 కోట్ల ఐఫోన్ల లూటీ?

కార్పొరేట్ సంస్థలకు కేరాఫ్ అడ్రస్‌ అయిన బెంగళూరులో జరిగిన ఓ అనూహ్య పరిణామం.. ఇప్పుడు భారత కార్పొరేట్ రంగాన్నే కుదిపేస్తోంది. బెంగళూరు శివార్లలో ప్రఖ్యాత మొబైల్ బ్రాండ్ ఐఫోన్‌ల తయారీ జరిగే విస్ట్రన్ ఫ్యాక్టరీపై ఆ సంస్థ ఉద్యోగులే దాడికి పాల్పడటం, వందల కోట్ల రూపాయల ఐఫోన్లను లూటీ చేయడం కలకలం రేపుతోంది. కరోనా టైంలో ఈ సంస్థ ఉద్యోగుల పట్ల అన్యాయంగా ప్రవర్తించిందట.

నాలుగు నెలల పాటు జీతాలివ్వలేదట. అంతే కాక తమ ఉద్యోగాలు గాల్లో దీపంలా మారిపోవడంతో వేల మంది ఉద్యోగులు కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వీరి ఆందోళన హింసాత్మక రూపం దాల్చింది. వేలమంది కంపెనీ మీదికి దండెత్తారు. వారిని భద్రత సిబ్బంది అదుపు చేయలేకపోయారు. కంపెనీలోపలికి చొరబడి అద్దాలు, ఫర్నిచర్ పగలగొట్టడం మొదలుపెట్టారు. ఒక దశ దాటాక దాడి తీవ్ర రూపం దాల్చింది.

ఈ క్రమంలో లోనికి చొరబడ్డ ఆందోళన కారులు వేల సంఖ్యలో ఐఫోన్లను లూటీ చేసినట్లు తెలుస్తోంది. ఇలా దోచుకెళ్లిన ఐఫోన్ల విలువ 440 కోట్ల రూపాయలని ఆ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్యోగులు రాడ్లు పట్టుకుని కార్యాలయాన్ని ధ్వంసం చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఓ కార్పొరేట్ సంస్థ మీద ఈ స్థాయిలో ఉద్యోగులు దాడికి పాల్పడటం, తీవ్ర నష్టం తెచ్చిపెట్టడం భారత కార్పొరేట్ రంగంలోనే కీలక పరిణామంగా భావిస్తున్నారు.

యాపిల్ సంస్థ సదరు సంస్థలో కొత్తగా 8 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవాలనుకుంటోందని.. ఈ నిర్ణయం ఇప్పుడు డోలాయమానంలో పడ్డట్లే అని.. భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి యాపిల్ నిరాకరించవచ్చని, ఇతర మల్టీ నేషనల్ కంపెనీల పెట్టుబడుల మీదా ఇది ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామంతో కర్ణాటక సర్కారు అప్రమత్తం అయింది. ఆందోళన కారులపై కేసులు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.