ఐపీఎల్-14 ఇండియాలోనే.. ఇదిగో రుజువు

ఈ ఏడాది వేస‌విలో జ‌ర‌గాల్సిన ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ 13వ సీజ‌న్ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డ‌టం.. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో యూఏఈలో ప్రేక్ష‌కులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో లీగ్‌ను నిర్వ‌హించ‌డం తెలిసిన సంగ‌తే. ఐతే క‌రోనా క‌ష్ట కాలంలో జ‌నాల‌కు గొప్ప ఉప‌శ‌మ‌నంగా క‌నిపించిన ఐపీఎల్ సూప‌ర్ హిట్ట‌యింది. అంచ‌నాల్ని మించి ఆద‌ర‌ణ సంపాదించుకుంది. భారీగా ఆదాయం ఆర్జించి పెట్టింది.

ఈ ఉత్సాహంలో కొత్త ఏడాదిలో షెడ్యూల్ ప్ర‌కారం ఏప్రిల్, మే నెల‌ల్లోనే టోర్నీనిర్వ‌‌హించ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది బీసీసీఐ. ఐతే ఇండియాలో క‌రోనా ప్ర‌భావం ఇంకా కొన‌సాగుతున్న నేప‌థ్యంలో 14వ సీజ‌న్‌ను స్వ‌దేశంలో నిర్వ‌హిస్తారా.. మ‌రోసారి యూఏఈకి లీగ్‌ను తీసుకెళ్తారా అన్న ఉత్కంఠ నెల‌కొంది అంద‌రిలో.

ఐతే ఈసారి ఐపీఎల్ ఇండియాలోనే అని బీసీసీఐ సంకేతాలు ఇచ్చేసింది. డోలాయ‌మానంలో ఉన్న‌ ఇంగ్లాండ్‌తో భార‌త్ సిరీస్ షెడ్యూల్‌ను ఖ‌రారు చేయ‌డ‌మే ఇందుకు సూచిక‌. ఫిబ్ర‌వ‌రి 5 నుంచి భార‌త్‌లో ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న ఆరంభం కానుంది. మార్చి 28న సిరీస్ ముగుస్తుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్‌తో ఇంగ్లాండ్ వ‌రుస‌గా నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వ‌న్డేలు ఆడుతుంది.

ఐపీఎల్ ఏప్రిల్ తొలి, రెండో వారంలో ఆరంభం కావాల్సి ఉండ‌గా.. దానికి వారం ప‌ది రోజుల ముందు అంత‌ర్జాతీయ సిరీస్‌ను ఇండియాలో ఆడిస్తున్నారంటే ఐపీఎల్ నిర్వ‌హించ‌డానికి అభ్యంత‌రాలేముంటాయి? యూఏఈలో లీగ్ ఆడాలంటే టోర్నీ ఆరంభానికి మూణ్నాలుగు వారాల ముందే అక్క‌డికెళ్లాలి.

మార్చి 28 వ‌ర‌కు మ‌న‌వాళ్లు ఇండియాలో సిరీస్ ఆడ‌నున్నారంటే ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్ల‌ర‌న్న‌మాట‌. కాక‌పోతే ఐపీఎల్‌-14ను ఖాళీ స్టేడియాల్లో నిర్వ‌హిస్తారా.. లేక అభిమానుల‌ను అనుమ‌తిస్తారా అన్న‌దే ఇక తేలాల్సి ఉంది.