“ఇండియాను వదలొద్దు”.. పాక్ ప్లేయర్ కు చేతులెత్తి మొక్కుతూ..

ఆసియా కప్‌లో భారత్ పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్ హీట్ పెంచేలా ఉంది. గ్రూప్ స్టేజ్, సూపర్ 4లో ఇప్పటికే రెండుసార్లు తలపడినా పాక్ నెగ్గలేదు. ఇక మూడోసారి టైటిల్ పోరులో పాక్ రివేంజ్ కోసం ఢీ కొట్టబోతోంది. సెమీ ఫైనల్ తరహా మ్యాచ్‌లో పాకిస్థాన్ బంగ్లాదేశ్‌పై 11 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరింది. 135 పరుగుల లక్ష్యాన్ని రక్షించడంలో షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ చెరో మూడు వికెట్లు తీయడం కీలకమైంది.

ఈ విజయానంతరం హారిస్ రౌఫ్ అభిమానులను కలుసుకోవడానికి స్టాండ్స్‌కి వెళ్లాడు. అక్కడ ఓ అభిమాని రెండు చేతలతో దడం పెట్టి, కన్నీళ్లు పెట్టుకుని అతనికి ఒక విజ్ఞప్తి చేశాడు. “భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలి. ఇండియాను వదలొద్దు. దేవుని పేరుతో చెబుతున్నా.. ఈ ఫైనల్ గెలవాలి” అని ఆ ఫ్యాన్ అన్నాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హారిస్ రౌఫ్ ఆ అభిమానికి ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి వెళ్ళిపోయాడు.

అయితే హారిస్ రౌఫ్ పేరు ఈ టోర్నీలో వివాదాలకీ కారణమైంది. సూపర్ 4లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిమానులపై అసభ్య సంకేతాలు చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. భారత అభిమానులు “కోహ్లీ, కోహ్లీ” అంటూ నినాదాలు చేసినప్పుడు విమానం కూల్చేసినట్లు చూపిస్తూ సంకేతం చేశాడు. ఇది 2022లో కోహ్లీ వేసిన రెండు సిక్స్‌లను గుర్తుచేసి ఎగతాళి చేసినట్టే అని విమర్శలు వచ్చాయి.

అంతేకాకుండా, అదే మ్యాచ్‌లో హారిస్ రౌఫ్ భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలపై దుర్భాషలాడినట్టు వీడియోలు బయటపడ్డాయి. అయితే ఇద్దరూ బ్యాట్‌తో సమాధానం చెప్పి రన్స్ సాధించారు. ఇదే సమయంలో పాక్ బ్యాటర్ సహిబ్‌జాదా తన హాఫ్ సెంచరీ అనంతరం బ్యాట్‌ను మెషీన్ గన్‌లా పట్టుకుని గన్ ఫైరింగ్ తరహాలో చేయడం మరో పెద్ద వివాదానికి దారి తీసింది.

ఇక ఫైనల్ వేదికగా దుబాయ్ సిద్ధమవుతోంది. అభిమానుల్లోనూ, ఆటగాళ్లలోనూ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. పాక్ ఫ్యాన్స్ ప్రతీకారం మాటలు చెబుతుండగా, భారత జట్టు మాత్రం హ్యాట్రిక్‌పై దృష్టి పెట్టింది. మైదానంలో ఎవరు పైచేయి సాధిస్తారన్నది సెప్టెంబర్ 28న తేలనుంది. ఒకవైపు అభిమానుల భావోద్వేగం, మరోవైపు ఆటగాళ్ల ప్రదర్శన.. ఈ ఫైనల్ ఆసియా కప్ చరిత్రలో గుర్తుండిపోయేలా ఉండనుందని అనిపిస్తుంది.