ఆంధ్రప్రదేశ్ వాసులకు వర్షాల పరీక్ష ఇంకా పూర్తికాలేదట. బంగాళాఖాతం మీద వరుస అల్పపీడనాలు ఏర్పడటంతో రాబోయే రోజుల్లో కూడా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాలు ప్రవేశించిన తొలి రెండు నెలల్లో పెద్దగా వర్షాలు రాకపోయినా, ఆ లోటు ఆగస్టులో పూడ్చాయి. ఇప్పుడు సెప్టెంబరులోనూ అదే ధోరణి కనిపిస్తోందని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అవుతున్నాయి.
ఇటీవల విశాఖపట్నం పరిసరాల్లో ఏర్పడిన ద్రోణి, అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో తేలికపాటి వర్షాలే కురుస్తాయి. కానీ వాతావరణ మార్పులతో ఈసారి వాయుగుండం తరహాలో వర్షపాతం నమోదవుతోందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని అమెరికాకు చెందిన నోవా మోడల్ అంచనా వేస్తోంది.
రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం రాబోయే మూడు రోజుల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచవచ్చని, ఈ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచనలు ఇచ్చారు. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో 70.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.
దేశవ్యాప్తంగా కూడా ఈసారి సెప్టెంబరు వర్షాలు విస్తారంగా కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. నెలవారీ సగటు వర్షపాతం దీర్ఘకాలిక సగటు కంటే 109 శాతం అధికంగా ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మొత్తానికి ఆగస్టులో ఊపందుకున్న వర్షాలు ఇప్పుడు సెప్టెంబరులోనూ కొనసాగుతున్నాయి. వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates