కూకట్‌పల్లి బాలిక హత్య: వీడిన మిస్టరీ!

హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన కూకట్‌పల్లి బాలిక సహస్ర (10) హత్య కేసులో కీలక విషయాలను వెల్లడయ్యాయి. నిందితుడు పెద్ద వయస్కుడు లేదా ప్రొఫెషనల్ క్రిమినల్ కాదు, పదో తరగతి చదువుతున్న బాలుడే హత్య చేశాడని దర్యాప్తులో బయటపడింది. ఈ సంఘటనతో సమాజం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు ఇంట్లో దొంగతనానికి వెళ్లాడు. కానీ ఆ సమయంలో సహస్ర ఇంట్లో ఒంటరిగా ఉండటంతో అతడిని చూసి భయపడ్డాడు. 

దాంతో నేరాన్ని దాచిపెట్టడానికి చిన్నారి ప్రాణం తీశాడు. అంతే కాకుండా, చోరీ ఎలా చేయాలో ముందే ఒక పేపర్‌పై రాసుకొని ప్రణాళిక వేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఆ పేపర్‌ను స్వాధీనం చేసుకుని ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన జరిగిన రోజున సహస్ర తల్లిదండ్రులు ఉద్యోగాల రీత్యా ఆఫీసులకు వెళ్లారు. తమ్ముడు పాఠశాలకు వెళ్లగా, పాఠశాలకు సెలవు ఉన్న సహస్ర ఇంట్లో ఒంటరిగా ఉంది. 

మధ్యాహ్నం సమయంలో తండ్రికి స్కూల్ నుండి ఫోన్ రావడంతో ఆయన ఇంటికి వచ్చి తలుపు తెరిచారు. కానీ మంచంపై తన కుమార్తె రక్తపుటేరుల మధ్య ప్రాణం లేని స్థితిలో కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం సహస్ర శరీరంపై సుమారు 20 కత్తి గాయాలు ఉన్నట్టు తెలిసింది. వాటిలో 10 గాయాలు మెడపై ఉన్నాయి. ఉదయం 9.30 నుంచి 10.30 గంటల మధ్య హత్య జరిగిందని డాక్టర్లు నిర్ధారించారు. 

ఆ సమయంలో బాలిక కేకలు వినిపించాయని పొరుగువారు చెబుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆధారాలను సేకరించి సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి, నిందితుడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాలుడిని పోలీసులు విచారిస్తున్నారు. అతడి వయసు, చేసిన నేరం, ప్రణాళికా రీతిని పరిశీలిస్తే సమాజంలో చిన్న వయసులోనే క్రైమ్ వైపు మళ్లిపోతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. సహస్ర కుటుంబం విషాదంలో మునిగిపోయి న్యాయం కోసం ఎదురుచూస్తోంది. ఈ కేసు మరింత లోతుగా దర్యాప్తు జరిపి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.