బెట్టింగ్‌ యాప్స్‌.. తేడా వస్తే కఠిన శిక్షలే..

ఆన్‌లైన్‌ గేమింగ్‌ మోసాలను కట్టడి చేయడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్‌ ఆమోదం పొందిన కొత్త ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లు ద్వారా డిజిటల్‌ బెట్టింగ్‌ యాప్స్‌పై కఠిన నియంత్రణలు, శిక్షలు విధించేందుకు మార్గం సుగమమైంది. ఇది దేశంలో తొలిసారిగా ఆన్‌లైన్‌ గేమింగ్‌ను పద్ధతిగా చట్టబద్ధంగా నియంత్రించడానికి ప్రయత్నం కావడం విశేషం. ముఖ్యంగా నియంత్రణలో లేని బెట్టింగ్‌ యాప్స్‌ వల్ల కలిగే మోసాలు, వ్యసన సమస్యలను అరికట్టడమే ఈ బిల్లుకు ప్రధాన ఉద్దేశం.

గత కొన్ని ఏళ్లుగా ఈ రంగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పర్యవేక్షణను కఠినతరం చేసింది. 2023 అక్టోబర్‌ నుంచి లీగల్ గా కొనసాగే పలు ఆన్‌లైన్‌ గేమింగ్‌లపై 28 శాతం జీఎస్టీ విధించగా, గేమ్స్‌ ద్వారా వచ్చే గెలుపులపై 30 శాతం పన్ను విధిస్తున్నారు. విదేశీ గేమింగ్‌ ప్లాట్‌ఫాంలను కూడా పన్ను పరిధిలోకి తెచ్చారు. నమోదు లేని యాప్స్‌, వెబ్‌సైట్లను బ్లాక్‌ చేసే అధికారం అధికారులకు ఇచ్చారు.

గత ఏడాది కొత్త క్రిమినల్‌ నిబంధనలతో అనుమతి లేని బెట్టింగ్‌కి ఏడేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధించేలా చట్టం రూపొందించారు. అయినప్పటికీ రాజ్యాంగంలోని రాష్ట్రాల జాబితాలో ‘బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌’ అంశాలు ఉన్నందున రాష్ట్రాలకూ ప్రధాన అధికారం ఉంటుంది. కేంద్రం తీసుకున్న తాజా బిల్లు ఈ చర్యలకు మరింత బలాన్ని ఇస్తుంది.

2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు కేంద్రం 1,400 కంటే ఎక్కువ వెబ్‌సైట్లు, యాప్స్‌ను బ్లాక్‌ చేసింది. వ్యసన సమస్యలను తగ్గించేందుకు విద్యాశాఖ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచనలు జారీ చేసింది. ప్రసార మాధ్యమాలపై గేమింగ్‌ యాడ్స్‌ వస్తే వాటిలో ఆర్థిక ప్రమాదాలు, వ్యసన ముప్పు ఉంటాయన్న హెచ్చరిక తప్పనిసరి చేయమని సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చింది.

ముఖ్యంగా విద్యార్థులు, యువత గేమింగ్‌ వ్యసనంలో పడిపోవడం ఆందోళన కలిగిస్తున్న వేళ ఈ బిల్లు ఒక రక్షణగా భావిస్తున్నారు. డిజిటల్‌ గేమింగ్‌ వినోదాన్ని సమతుల్యం చేస్తూ, ఆర్థిక మోసాలు, వ్యసనాలపై అడ్డుకట్ట వేయడం లక్ష్యం. మొత్తం మీద ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లు ఆమోదం దేశంలో డిజిటల్‌ గేమింగ్‌ చరిత్రలో కీలక మలుపు. గేమింగ్‌ పరిశ్రమను చట్టబద్ధం చేస్తూనే, దుర్వినియోగం చేసే వారికి కఠిన శిక్షలు ఉండబోతున్నాయి.