బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. ప్రతిపక్ష పార్టీ అయినా..సొంత పార్టీ అయినా..చెప్పాలనుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఆయన నైజం. పార్టీ బలోపేతం కోసం, పార్టీని అధికారంలోకి తేవడం కోసం తపనతో చేస్తున్నానని చెబుతూ రాజాసింగ్ చేసే పలు కామెంట్లు ఎన్నోసార్లు కాంట్రవర్షియల్ అయ్యాయి. అయినా సరే నేనింతే అంటూ రాజా సింగ్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి రాజా సింగ్ తన మార్కు కామెంట్లతో వార్తల్లో నిలిచారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై రాజాసింగ్ పెదవి విరిచారు. నావాడు, నీవాడు అంటూ అధ్యక్షుడిని నియమించుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం తప్పదని రాజా సింగ్ అంటున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్ఠానం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోందని, కానీ, ఇలా నియమించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్యనేత వరకు ఓటేసి ఎన్నుకోవాలని రాజాసింగ్ అన్నారు.
మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ హై కమాండ్ నియమించారని, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావు పేరు ఖరారైందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజా సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరి, రాజా సింగ్ కామెంట్లపై బీజేపీ హై కమాండ్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates