ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓడిపోయింది. ఈ ఓటమితో పాటు ఓ అరుదైన చెత్త రికార్డును కూడా టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. టెస్టు క్రికెట్ చరిత్రలో బ్యాటర్లు ఒకే మ్యాచ్లో ఐదు సెంచరీలు చేసిన జట్టు ఓడిపోవడం ఇదే తొలిసారి. భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించినా, బౌలర్లు మాత్రం నిరాశపరిచి జట్టుకు పరాభవం మిగిల్చారు.
ఈ మ్యాచ్లో మొదట భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. మొదటి ఇన్నింగ్స్లో రిషభ్ పంత్ 134, గిల్ 147, రాహుల్ 137, జైస్వాల్ 101 పరుగులతో సెంచరీలు చేశారు. పంత్ రెండో ఇన్నింగ్స్లో కూడా 118 పరుగులు చేసి మరో సెంచరీ చేశాడు. మొత్తంగా భారత్ 471, 364 పరుగులు చేసింది. కానీ బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లను అడ్డుకోలేకపోయారు.
ఇంగ్లాండ్ జట్టు 371 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి 5 వికెట్లు మాత్రమే కోల్పోయి గెలిచింది. ముఖ్యంగా డకెట్ 149 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో జో రూట్, జామీ స్మిత్ ల భాగస్వామ్యం మ్యాచ్ను ఇంగ్లాండ్ వైపు తిప్పేసింది. దీంతో సిరీస్లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంతకు ముందు 1928-29లో ఆస్ట్రేలియా జట్టు నాలుగు సెంచరీల తర్వాత ఓడిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు భారత్ ఐదు సెంచరీల తర్వాత కూడా ఓడిపోవడం క్రికెట్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది.
ఇది భారత క్రికెట్ అభిమానులను తీవ్రంగా కలిచివేసిన సంఘటనగా మారింది. రోహిత్, విరాట్ రిటైర్మెంట్ అనంతరం గిల్ నాయకత్వంలో ఆడిన ఈ తొలి టేస్ట్ టీమిండియాకు ఒక బిగ్ సవాల్. ఈ పరాజయం తర్వాత భారత్ జట్టు సమీక్ష తప్పనిసరి అయింది. బ్యాటింగ్ ఎంత బలంగా ఉన్నా బౌలింగ్ లోపిస్తే విజయాలు సాధ్యం కాదని మరోసారి ఈ మ్యాచ్ రుజువు చేసింది. బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేయకపోతే ముందు మ్యాచ్లలోనూ ఇలాంటివే జరుగవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates