అదిగో పులి.. అంటే ఇదిగో తోక.. అన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం పరుగులు పెడుతోంది. ప్రస్తుతం భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ కీలక ప్రకటన ఇచ్చిందంటూ.. సోషల్ మీడియా ఊదర గొడుతోంది. ప్రాదేశిక(టెర్రిటోరియల్) సైన్యంలో చేరాలంటూ సాధారణ పౌరులకు ఆహ్వానం పలికినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసిందని కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
దీనిలో 18 ఏళ్ల నుంచి 42 ఏళ్లలోపు వారికి అవకాశం ఉంటుందని…. విద్యార్హత డిగ్రీ..ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ఆదాయం కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని కూడా పేర్కొన్నారు. కానీ.. ఆర్మీ వెబ్ సైట్లో కానీ.. ఆర్మీ అధికారులు కానీ.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజల మూడ్ను తమవైపు తిప్పుకొనేందుకు.. భారత దేశ ఆర్మీ పాటవం సరిపోవడం లేదన్న ప్రచారం చేసేందుకు జరుగుతున్న కుయుక్తి ప్రచారంగా ప్రభుత్వం పేర్కొంది.
టెర్రిటోరియల్ ఆర్మీ వ్యవహారానికి వస్తే.. సైనిక అధికారులను ఏటా రెండు సార్లు రిక్రూట్మెంట్ చేసు కుంటారు. ఇది సాధారణ ప్రక్రియ. దీనికి ప్రత్యేకంగా ఇచ్చే వేతన, భత్యాలు ఉండవు. అవసరమైనప్పుడు పిలిచి.. భోజనం పెట్టి.. గౌరవార్థసేవలను వినియోగించుకుంటారు. దీని ప్రకారం.. ఈ ఏడాది మార్చి 26నే టెర్రిటోరియల్ రిక్రూట్మెంటు కోసం ఆర్మీ ప్రకటన ఇచ్చింది. అయితే.. దీనిని లేటెస్టు రిక్రూట్మెంటు అంటూ.. ప్రచారం చేస్తున్నారు.
ఇదిలావుంటే.. తాజాగా మే 8న ఆర్మీ ప్రకటన ఇచ్చిన మాట వాస్తవమే. కానీ, అది .. పశువైద్యుల కోసం ఇచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ బెటాలియన్లలో ఉన్న గుర్రాలు, కుక్కలు, గాడిదల ఆరోగ్య రక్షణ కోసం.. పశువైద్యులను రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇవి 20 పోస్టులు ఉన్నాయి. వీటి కోసం అయితే.. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా రిక్రూట్మెంటు జరుగుతోంది. కానీ.. దీనినే ప్రాదేశిక నియామకాల కింద చూపిస్తూ.. కొందరు చేస్తున్న ప్రచారం తప్పని భారత ఆర్మీ అధికారులు ప్రకటించారు. దీని కింద ఆన్లైన్లో నగదు చెల్లిస్తే.. తమకు సంబంధం లేదని చెబుతున్నారు.