అమెరికా బోటు ప్రమాదంలో ఇద్దరు భారతీయ చిన్నారుల గల్లంతు

అగ్రరాజ్యం అమెరికాలో చోటుచేసుకున్న ఓ బోటు ప్రమాదంలో భారత్ కు చెందిన ఇద్దరు చిన్నారులు గల్లంతు అయ్యారు. పిల్లల తల్లిదండ్రులు ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలిఫోర్నియాలోని శాన్ డియాగోకు 15 మైళ్ల దూరంలో పసిఫిక్ మహా సముద్రంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా… ఏడుగురు గల్లంతు అయ్యారు. గల్లంతైన ఏడుగురిలో ఇద్దరు భారతీయ చిన్నారులు ఉన్నారు. అమెరికా, భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయాలు తెలిపిన వివరాల మేరకు ఈ బోటు శరణార్థులతో వెళుతున్నట్లుగా సమాచారం.

మొత్తం 16 మందితో ఈ బోటు బయలుదేరగా.. సముద్ర తీరం నుంచి కాస్తంత దూరం వెళ్లినంతనే ఈ బోటు ప్రమాదానికి గురైంది. బోటులోని వారిలో ఓ భారతీయ కుటుంబం ఉండగా… ఆ కుటుంబంలో భార్యాభర్తలు ప్రాణాలతో బయటపడగా… వారి పిల్లలిద్దరూ గల్లంతు అయ్యారు. ప్రాణాలతో బయటపడిన భారతీయ దంపతులను స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని మెరుగైన వైద్య చికిత్సలు అందేలా ఏర్పాట్లు చేసినట్లు శాన్ ఫ్రాన్సిస్ కో లోని భారత కాన్సులేట్ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. అయితే ఈ బోటు ప్రయాణానికి ఎలాంటి అనుమతులు లేవని, దీనిలో మనుషులను అక్రమంగా రవాణా చేస్తున్నట్లుగా గుర్తించామని అమెరికా కోస్ట్ గార్డ్ తెలిపింది.

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టాక అమెరికా పౌరసత్వంపై కఠిన చట్టాలు అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనుమతులు లేకుండా ఆ దేశంలో ఉంటున్న వివిధ దేశాలకు చెందిన వారిని ఇప్పటికే అమెరికా వారి దేశాలకు పంపించేసింది. అమెరికా అధికారుల కంటబడకుండా ఉండిపోయిన వారు ఇలా గుట్టుచప్పుడు కాకుండా అమెరికాను వదిలేందుకు యత్నిస్తున్నట్లుగా సమాచారం. ఇలా అమెరికా ఆంక్షల కత్తిని దాటుకుని తమ దేశానికి వెళ్లిపోదామని భావించిన 16 మంది ఈ బోటు ప్రమాదంలో చిక్కుకున్నారు. వీరిలో నలుగురు సభ్యులు భారతీయ కుటుంటం ఉండటం… వారిలో ఇద్దరు చిన్నారులు గల్లంతు కావడం విచారకరం.